అసలే కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ బారినపడితే ప్రాణాలతో బట్టకడతామా? అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది. దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సమర్థమైన చికిత్సలు కానీ ఇంకా అందుబాటులోకి రానందున దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. ఇదే సమయంలో కరోనా రోగులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ ఆవేదన చెందారు. తనతోపాటు తన తల్లికి కూడా కరోనా సోకగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరామని అక్కడ ఏ మాత్రం సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చెల్లిస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం తిండి కూడా సరైంది పెట్టడం లేదని వివరించారు. నిన్న మధ్యాహ్నం నాటి ఆహారాన్ని ఇప్పుడు పెడుతున్నారని, అది పాడు కంపు కొడుతోందని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే వైద్యం చేయాల్సింది పోయి గంటల కొద్దీ తమను అలాగే వదిలేశారని డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పదేపదే అడిగినా వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేరినప్పటి నుంచి అక్కడ డ్యూటీ డాక్టర్ను చూడలేదని చెప్పారు. తమ పరిస్థితి అధ్వానంగా ఉందని వివరించారు. కనీస సౌకర్యాలు ఏమీ లేనందునే ఈ సెల్ఫీ వీడియో తీస్తున్నానని, మీడియా వారు సహకరించి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించాలని కోరారు.