ఈ మధ్య దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మధ్య దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. బాలేశ్వర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అనేక మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందు పలు చోట్ల రైలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకి ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు వెంకటగిరి వద్దకు రాగానే ఏసీ బోగీ చక్రాల నుండి పొగలు వచ్చాయి. వెంటనే గుర్తించిన ప్రయాణీకులు అప్రమత్తమై.. చైను లాగి రైలును ఆపేశారు. బయటకు పరుగులు పెట్టారు. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి.. ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు నిలిచిపోయింది. మరమ్మత్తులు చేపట్టిన అనంతరం తిరిగి రైలు గమ్య స్థానం వైపు బయలు దేరింది. ప్రయాణీకులు సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. లేకుంటే మంటలు అలముకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ తిరుపతి మధ్య నడుస్తోంది.