తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే. పిల్లలను మంచి స్థానంలో చూసేందుకు అహర్నిశలు కష్టపడుతుంటాడు. పిల్లలకు తమ కష్టం విలువ తెలియకుండా పెంచి పోషిస్తాడు. గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ.. పిల్లలపై తండ్రికి ఉండే ప్రేమ,అనురాగాలకు వేరే లెక్క ఉంటుంది. తమ బాధలు పిల్లలకు తెలియకూడదని.. వారి నిద్రపోయాకో లేక వారి లేని సమయంలో తల్లిదండ్రులు గొడవ పడుతుంటారు. కానీ నేడు పిల్లల ముందే భార్యా భర్తలు కొట్టుకు చస్తున్నారు.
తన్నుకు చావడమో కానీ, ఈ గొడవల కారణంగా పిల్లల్ని బలి తీసుకుంటున్నారు కొంత మంది తండ్రులు. ఇటీవల హైదరాబాద్లో భార్య మీద కోపంతో 9 ఏళ్ళ కూతురుని స్కూల్ నుండి తీసుకెళ్ళి చంపిన తండ్రి ఉదంతం మరువకముందే ఇదే తరహాలో ప్రకాశం జిల్లా కనిగిరిలో మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కొండాపురం గ్రామానికి చెందిన బూసిరాజు వెంకటేశ్వర్లు, పద్మాపురం గ్రామానికి చెందిన వెంకట నరసమ్మలకు 16 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. బాధ్యతగా ఉండాల్సిన తండ్రి.. చెడు వ్యసనాలకు లోను అయ్యాడు. ఇక పిల్లల్ని పెంచేందుకు తల్లి కనిగిరిలో బేల్దారి పనులకు వెళ్లడం ప్రారంభించింది. ఆమెతో పాటు చిన్న కుమార్తె మంజులను రోజు నగరానికి తీసుకు వచ్చి పాఠశాలలో దిగబెట్టి.. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకుని వస్తూ ఉంటుంది తల్లి.
సోమవారం కూడా పాపను తెచ్చేందుకు స్కూలుకు వెళ్లింది తల్లి. అయితే ఆమెను తండ్రి తీసుకెళ్లినట్లు చెప్పారు తోటి విద్యార్థులు.అయితే భర్తతో విబేధాలు ఉండటం వల్ల.. అతడితో మాట్లాడటం లేదు. ఇంటికి తీసుకెళ్లి ఉంటాడన్న ఉద్దేశంతో పద్మాపురం వెళ్లిపోయింది. కానీ తండ్రి ఘాతుకానికి తెరలేపుతాడని ఏ మాత్రం ఊహించలేదు తల్లి. స్కూల్ నుండి ఇంటికి తీసుకెళుతున్నట్లు మంజులను వెంట తీసుకెళ్లాడు తండ్రి. కుమార్తెతో పాటు బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కి ఎన్.గొల్లపల్లి చెరువు సమీపంలో పద్మాపురానికి వెళ్లే రోడ్డు దగ్గర దిగాడు. ఇంటికి వెళుతున్నట్లుగా ఆమెను నడిపించి.. రాళ్ల గుట్ట వద్దకు రాగానే.. ఎవ్వరూ లేని సమయంలో చూసి పాపను కింద పడేసి..రాళ్లతో తల, ముఖంపై మోది అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత పరారయ్యాడు.
రాత్రంతా పిల్ల ఇంటికి రాకపోవడంతో తండ్రి వద్దే ఉందనుకుంది తల్లి. మంగళవారం ఉదయం వెంకటనరసమ్మ యథావిధిగా తన సోదరుడితో కలిసి కనిగిరి బయలుదేరారు. గొల్లపల్లి గ్రామ శివారుకు రాగానే అక్కడ చాలా మంది జనం గుమిగూడి ఉండటం చూసి అక్కడకు వెళ్లారు. రక్తపు మడుగుల్లో, స్కూల్ యూనిఫాంలో తన కుమార్తె మృతదేహం పడి ఉండటంతో తల్లి ఖిన్నురాలు అయ్యింది. వెంటనే రోదిస్తూ కుప్పకూలిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. ఏడుగంటల వ్యవధిలోనే నిందితుణ్ని అరెస్టు చేశారు పోలీసులు. భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు.. నెలకో బిడ్డను చంపుతానని బెదిరించేవాడని.. నిజంగానే అన్నంత పనీ చేస్తాడని ఊహించలేకపోయానని బాధితురాలి తల్లి నరసమ్మ కన్నీటి పర్యంతమైంది.