కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో విటమిన్-డి, జింక్. సెలినీయం, విటమిన్-ఈ వంటి పోషకాలు ఉంటాయి.
గుడ్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇది ప్రోటీన్లకు మంచి వనరు. శిశువుల్లో శక్తిని అందించి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాల్మన్ చేపలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది నొప్పిని నివారించి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. బాదం.. విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉండే ఆహారం బాదం. రోజూ ఉదయాన్నే కొన్ని బాదం గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని పిల్లలకు స్నాక్స్ రూపంలో అందిస్తే మంచిది. అధికబరువు తగ్గడంలోనూ బాదం గింజలు తోడ్పడుతాయి. పెరుగు.. పిల్లలకు సులభంగా జీర్ణమై.. మంచి చేకూర్చే ఆహారం పెరుగు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా వేడిని కూడా తగ్గిస్తుంది. చక్కెర లేకుండా పెరుగును పిల్లలకు తినిపించేలా జాగ్రత్త పడండి. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర విలువైన పోషకాలు కూడా పుష్కలంగా దొరుకుతాయి. చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం కావడంతో పాటు రోగకారక క్రిములను నిరోధించడంలో ఓట్ మీల్ సహాయపడుతుంది. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.