ఒక్కసారి భారత రాజకీయ చరిత్రను తరచి చూస్తే.. వారసత్వ రాజకీయాలు వేళ్లునికునిపోయాయి అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి తరం నాయకులు కేసీఆర్, వైఎస్సార్ వరకు.. వీరంతా తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకువచ్చారు.. వస్తున్నారు. వారిని అన్ని విధాలుగా ప్రజలకు చేరువ చేసి.. ఆ తర్వాత వారికి పార్టీ కీలక బాధ్యతలు, కొన్ని సందర్భాల్లో సీఎం కుర్చీనే అప్పగిస్తున్నారు. మన దేశంలో ఏళ్లుగా రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. తమ తర్వాత తమ కుటుంబ సభ్యులే పార్టీలో కీలక పదవుల్లో ఉండాలని భావిస్తారు. బయటివారిని ఎదగనివ్వరు. ఇది ఇలానే కొనసాగితే.. ఆఖరికి మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలు తలెత్తుతాయి. ఇప్పుడు ఈ వారసత్వ రాజకీయాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీని జాతీయ పార్టీ కాదు అని ప్రకటించడంతో ఈ వాదన తెర మీదకు వచ్చింది.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయాధ్యక్షుడి హోదాలో ఉండగా.. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో చంద్రబాబు నాయడు జాతీయాధ్యక్షుడు కాదు. ఆటోమెటిగ్గా ఆయన ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉంటారు. అదే హోదాలో ప్రస్తుతం రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అచ్చెన్న పార్టీలో పెద్దగా యాక్టీవ్గా లేరు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి ఓ వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే త్వరలోనే అచ్చెన్నాయుడు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కుతాయి.
అచ్చెన్నాయుడు బీసీ నేత కాబట్టే ఆ కార్డుని వాడుకోవాలని ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్న అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో ప్రభావమో మరేమో తెలియదు కానీ అచ్చెన్నను నాటి నుంచే సైడ్ చేశారు అన్న విమర్శలూ వచ్చాయి. ఇలాంటి నేపధ్యంలో అచ్చెన్నాయుడు చేత బీసీలను ఆకర్షించేందుకు బస్సు యాత్ర చేయించడానికి టీడీపీ సిద్ధపడుతోంది అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం అచ్చెన్న టీడీపీలో లోకేష్ కంటే కూడా బాగా ఫోకస్ అవుతారు. బాబుతో సరిసమానంగా ఆయన కూడా రాష్ట్రమంతా తిరుగుతారు.
మరి టీడీపీ అంటే పెదబాబు, చినబాబు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి కూడా ఎవరిని ఎదగన్వివడం లేదు. జూనియర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని.. పార్టీ కేడర్, అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నా.. చంద్రబాబు మాత్రం ఆ ప్రయత్నాలు చేయలేదు. జూనియర్ టీడీపీలోకి వస్తే.. లోకేష్కు ప్రాధాన్యత తగ్గడమే కాక తెరమరుగు అయ్యే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. లోకేష్ను జనాల్లో ఫోకస్ చేయడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇలాంటి పరిస్థితుల్లో.. రానున్న ఎన్నికల్లో బీసీలను ఆకర్షించేందుకు అచ్చెన్నను ఫోకస్ చేసి.. ఆఖరికి అచ్చెన్నను లోకేష్కు పోటీకి వచ్చేలా చేస్తాడా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడుని కనుక జనంలోకి పంపితే ఆయన తనదైన దూకుడుతో కచ్చితంగా ఏపీ పాలిటికల్ తెర మీద ఎంతో కొంత ఫోకస్ అవుతారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అచ్చెన్నను రంగంలోకి దింపితే.. ఆ బీసీ కార్డుతో రేపటి రోజున ఆయన కూడా సీఎం పదవికి పోటీ పడే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదే జరిగితే.. లోకేష్ను కాదని చంద్రబాబు అచ్చెన్నకు పట్టం కట్టడు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. సేమ్ అచ్చెన్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండేలా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వర్గం మాత్రం.. ముందే సీఎం కుర్చీ గురించి పోట్లాడుకునే బదులు.. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తే బెటర్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.