మన జీవితం ఇంతే అనుకుని బతికేవారికి ఇతని జీవితం ఒక ఆదర్శం. ఎందుకంటే ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి రెండు కంపెనీలకు సీఈఓ అయ్యే స్థాయికి ఎదిగారు.
ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నారనో.. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాననో లేదా ఇంకేదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నారనో చాలా మంది తమ పనిని తక్కువ చేసుకుంటారు. నిజానికి ఎవరి పని వారికి గొప్ప. ప్రతి ఒక్కరూ అందరి పనులకు గౌరవం ఇవ్వాలి. తప్పు చేయని ఏ పనైనా సరే గర్వంగా చెప్పుకోవచ్చు. అలా ఉన్నవారే ఉన్నతమైన శిఖరాలను అధిగమిస్తారు. పనిని ప్రేమించేవారు, దైవంగా భావించి పని చేసే వారు పైకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఇప్పటికే చాలా మంది తమ కార్యదక్షతతో రుజువు చేశారు. తాజాగా మరో యువకుడు కూడా దీన్ని నిరూపించారు. ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు రెండు కంపెనీలకు సీఈఓ అయ్యారు.
అదెలా సాధ్యం అంటే తనకు రెక్కలు ఉన్నాయి, ఎంత ఎత్తుకైనా ఎగరగలను అన్న ఆత్మవిశ్వాసం అతని దగ్గర ఉంది. అందుకే ఈ సక్సెస్ ని అందుకున్నారు. అతను మరెవరో కాదు.. దాదాసాహెబ్ భగత్. ఈయన ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేసేవారు. ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లో వచ్చిన అతిథులకు రూమ్ సర్వీస్, మంచి నీరు, టీ వంటివి అందించేవారు. ఈయన 1994లో మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో చదువు పూర్తయ్యాక పూణెకి మకాం మార్చారు. అక్కడ ఐటీఐ డిప్లొమా పూర్తి చేసి పని కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లో రూమ్ సర్వీస్ బాయ్ గా నెలకు రూ. 9 వేల జీతానికి జాయినయ్యారు. అక్కడ నుంచి ఆఫీస్ బాయ్ గా చేస్తూనే.. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ గురించి తెలుసుకుని దాని మీద ఆసక్తి పెంచుకున్నారు. నేర్చుకోవాలని ఉన్నా గానీ అందుకు తగిన చదువు తన దగ్గర లేదని గ్రహించిన భగత్.. యానిమేషన్, డిజైన్ వైపు అడుగులు వేశారు.
అలా రాత్రుళ్ళు రూమ్ సర్వీస్ బాయ్ గా పని చేస్తూ.. పగటి పూట యానిమేషన్ కోర్స్ నేర్చుకునేవారు. కోర్సు పూర్తయ్యాక ముంబైలో రియల్ టైం ఉద్యోగం కోసం నియమించబడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చి.. డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో పైథాన్, సీ++ నేర్చుకోవడం ప్రారంభించారు. అనేక విజువల్ ఎఫెక్ట్స్ ని రూపొందించాలంటే చాలా టైం పడుతుందని.. రీయూజ్డ్ టెంప్లేట్ ల లైబ్రరీని సృష్టించడం అద్భుతంగా ఉంటుందని గ్రహించారు. అలా సొంతంగా డిజైన్ చేసిన టెంప్లేట్స్ ని ఆన్ లైన్ లో సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నమ్మకం కలిగాక ఉద్యోగం మానేసి నైన్త్ మోషన్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీని 6 వేల మంది క్లయింట్స్ ఉన్నారు. అక్కడితో ఆగకుండా కరోనా సమయంలో డూ గ్రాఫిక్స్ పేరుతో మరొక కంపెనీని స్థాపించారు. ఇది కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.