ఖైరతాబాద్ గణేశున్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఖైరతాబాద్ గణపతిని లక్షలాధిమంది దర్శించుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
వినాయక చవితి వస్తుందనగానే పిల్లల్లో చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలందరు కలిసి చందాలు చేసి చిన్న గణేషున్ని పెట్టి ఆటపాటలతో సందడి చేస్తుంటారు. పెద్దవాళ్లలో కూడా సందడి మొదలవుతుంది. తొమ్మిది రోజులు పూజలు, ప్రసాదాలు, రికార్డింగ్ డ్యాన్స్లతో ఫుల్ బిజీ. నిమజ్జనం వరకు చిన్నపిల్లలు, పెద్దవారు అందరు కలిసి గణేషుని దగ్గర సందడి చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సమయంలో ఖైరతాబాద్ గణేషునిపై దృష్టి ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో రకంగా వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ ఏడాది ఖైరతాబాద్లో కనువిందు చేస్తున్న గణేషుని గురించి వివరాల్లోకి వెళితే..
వినాయక చవితికి ఎన్నో రకాల గణేష్ ప్రతిమలను తీర్చి దిద్దుతారు. అయినా కూడా అందరికి ఖైరతాబాద్ గణేషునిపై ఆసక్తి చూపుతారు. భక్తులందరు ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ గణేషుని పోస్టర్ వచ్చేసింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపు దిద్దుకుంటున్నాడు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే అందరు ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశున్ని ప్రారంభించి ఈ సంవత్సరంతో 69 ఏళ్లు అవుతుంది. ప్రతి ఏటా సిద్ధాంతి విఠలశర్మ సూచనతో నమూనా సిద్దం చేయడం ఆనవాయితీ. ఆయన సూచనల ప్రకారమే నామకరణ చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులు ఉంటుంది. నిలబడ్డ ప్రతిమ తీరులో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ గా రూపు దిద్దుకుంటున్నాడు. తలపై ఏడు పడగల సర్పరాజు, విగ్రహం వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు కలిగిన వినాయకుడు దర్శనమివ్వనున్నాడు. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, వరిధాన్యం, తల్వార్, బాణం ఉన్నాయి. ఎడమ వైపు కింది నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి.
ప్రతి ఏటా లాగానే ప్రధాన మండపం రెండు వైపులా ఏర్పాటు చేసి.. వేరే విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. 15 అడుగులతో కుడిపైపున శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమ వైపు శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న గణేషుని వేడుకలు మొదలై 28 వరకు జరుగనున్నాయి. దాదాపుగా విగ్రహం తయారీ పనులు 50 శాతం పూర్తి అయ్యాయి. వినాయక చవితికి మూడు రోజుల ముందుగానే భక్తులకు తిలకించేందుకు అనుమతించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.