ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు. గతంలో ఆడపిల్లల్ని కట్నం ఇవ్వలేక.. వయస్సులో పెద్దవాడు, ఎదురు కట్నం ఇచ్చే వ్యక్తికి పెళ్లి చేసేవారు తల్లిదండ్రులు. కానీ నేడు దేశం అభివృద్ధి చెందుతున్నా.. ఇలాంటి తండ్రుల మెదడుల్లో నీచపు ఆలోచనలు తొలగించలేకపోతున్నారు. తాజాగా ఓ దుర్మార్గపు తండ్రి.. తన అప్పులు తీర్చుకునేందుకు ముక్కు పచ్చలారని అమ్మాయిని.. వయస్సులో తనకంటే ఎంతో పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ లోని గోడ్డా జిల్లాలో నివసిస్తోంది బాలిక కుటుంబం. గత ఏడాది డిసెంబర్లో బాలిక తల్లి మృతి చెందింది. అనంతరం తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే అతడు పీకల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చాలంటూ రుణం ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు తన బిడ్డను ఇచ్చి వివాహం చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి తన సవతి తల్లి కూడా వంత పాడింది. చిన్నారికి ఇష్టం లేకపోయినా ఆమెకు గత జులైలో 52 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక ఆమెను బీహార్ లోని భాగల్పూర్ పంపించేశారు. అప్పటి నుండి ఆ బాలిక కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
తాజాగా ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తన తండ్రి చేసిన దారుణ సంఘటన గురించి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తన భర్త తనను నిత్యం కొడుతుంటాడని, శారీరకంగా,మానసికంగా వేధిస్తుంటాడని తెలిపింది. తుపాకీ చూపించి, తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని, ఈ వేధింపులను తాను భరించలేకపోతున్నానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. తన తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకోగా, వారు ఎటువంటి సహాయం చేయకపోగా, ఇది తమ పరిధిలోని కేసు కాదని ఆమెను పంపించి వేసినట్లు తెలిపింది.