కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై ప్రజలను సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల స్పందన సంగతి పక్కన పెడితే.. పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆనం రామానారాయణ రెడ్డి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయగా.. తాజాగా ఈ జాబితాలోకి నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేరారు.
కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రోజా. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా చిత్తూరు జిల్లాలోకి వెళ్తున్నా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు కూడా ఆమె రెడీ అయ్యారు. అంతేకాదు శ్రీ బాలాజీ జిల్లా పేరుపైనా రోజా చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
జగన్ ని కలిసేందుకు ప్రయత్నం..
ఇప్పటికే రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సొంత పార్టీలో నేతల తిరుగుబాట్లు, ఆధిపత్య పోరుతో సతమతమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు.. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగాంగా నగరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై త్వరలో జగన్ ను కలసి తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే సమస్యలపై చర్చించనున్నారని సమాచారం. ఇందుకోసం రోజా జగన్ అపాయింట్మెంట్ ను కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : అసత్య ప్రచారాలపై మండిపడిన MLA రోజా
ఎమ్మెల్యే రోజా ఈ డిమాండ్ చేయడానికి ముఖ్యకారణం ఏంటంటే.. నగరి నియోజకవర్గంలో కొంత బాలాజీ జిల్లాలో, కొంత చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల నగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారని ఆమె అభిప్రాయం. ప్రజల కోరిక మేరకు జగన్ ను కలిసి సమస్యను వివరిస్తానంటున్నారు. అయితే రోజా అభిప్రాయంలో రాజకీయ కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
డిమాండ్ వెనక రాజకీయ కారణాలు..
నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కొనసాగితే రాజకీయంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయని ఆమె భావిస్తున్నారట. ఇందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజా మధ్య ఉన్న వైరమే. బయటకు అందరూ బాగున్నట్లే ఉన్నా.. లోపల పొసగడం లేదని టాక్. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన చక్రపాణి రెడ్డి రోజాపై పైచేయి సాధించాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో నగరిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి నియోజకవర్గం ఉన్న జిల్లాలో చేరిస్తే రోజాకు మంత్రి పదవి కష్టమే అనే వాదన వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ నిర్ణయంతో అయోమయంలో ఎమ్మెల్యే రోజా
ఇక అదే జిల్లాలో మరో ప్రత్యర్థి నారాయణ స్వామి నియోజకవర్గం కూడా ఉంది. నారాయణ స్వామి సైతం పెద్దిరెడ్డి ఏం చెబితే అదే చేస్తుంటారనే ప్రచారం జోరుగా ఉంది. ఇలా గ్రూపులుగా ఏర్పడి.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రూపు రాజకీయాల కారణంగానే రోజాకు ఇంతవరకు మంత్రి పదవి రాలేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే జిల్లా మారితే అయినా ఫేట్ మారి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఆలోచనగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.