భారత్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్కు అగ్రరాజ్యం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే భారత్కు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఇతర అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు. గడిచిన వారం రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం భారత్కు 100 మిలియన్ డాలర్ల సాయం చేసిందని కమల గుర్తు చేశారు. అటు భారతీయ అమెరికన్లు సైతం మాతృదేశానికి సహాకరించేందుకు తమకు తోచిన సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. మిలియన్ల డాలర్ల విరాళాలు సేరకరించి, వాటితో వైద్యసామాగ్రి, మెడిసిన్స్ కొనుగోలు చేసి స్వదేశానికి పంపిస్తున్నారన్నారు. సేవా ఇంటర్నెషనల్ యూఎస్ఏ 10 మిలియన్ల డాలర్లు, ఏఏపీఐ(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) 3.5 మిలియన్ డాలర్లు, ఇండియాస్పోరా 2 మిలియన్ డాలర్లు ఇలా పలు భారతీయ అమెరికన్ సంస్థలు విరాళాల సేకరణలో కీలకంగా వ్యవహరించినట్లు కమల తెలియజేశారు.