గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటోంది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన భారత జట్టు.. దాన్ని మించిన పరాజయాలను పొందుతూ.. క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేస్తోంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన తొలి రెండు వన్డేలు ఓడి.. సిరీస్ కోల్పోయింది. శనివారం మిగిలిన ఆ చివరి వన్డే ఆడనుంది. ఆ తర్వాత ఈ నెల 14 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. అయితే.. తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియాపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరీ దారుణంగా బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ ఓడిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. కనీసం వంద పరుగులైనా చేయగలదా అనే అనుమానం కలిగించింది. కానీ.. తొలి వన్డే హీరో మెహిదీ-మహ్మదుల్లా కలిసి వీరోచితంగా పోరాటి.. బంగ్లాదేశ్కు భారీ స్కోర్ అందించారు. ఏకంగా 148 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ను టీమిండియా ఏ దశలోనూ ఛేదించేలా కనిపించలేదు. చివర్లో చేతి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ వచ్చి.. ఏదో ప్రయత్నం అయితే చేశాడు కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అయితే.. ఈ దారుణ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. మూడో వన్డేలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు ఆడటంలేదని బాంబు పేల్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ మూడో వన్డేకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. తొలి వన్డే ఆడిన కుల్దీప్ సేన్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డేకు కూడా అతను దూరం కానున్నాడు. ఒక రెండో వన్డే ఆరంభమైన రెండో ఓవర్లో క్యాచ్ పట్టబోయి గాయపడిన రోహిత్ శర్మ.. ఆస్పత్రికి వెళ్లి కట్టుకట్టుకొచ్చి మరీ 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి.. భారత్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. దీపక్ చాహర్ రెండో వన్డేలో కేవలం మూడు ఓవర్లు వేసి తొడ కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్ వేయలేదు. దీంతో వీరు ముగ్గురు కూడా మూడో వన్డేలో ఆడని కోచ్ ద్రవిడ్ ప్రకటించాడు. అయితే.. రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై చేరుకున్నట్లు సమాచారం. అలాగే.. 14 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్ అయినా ఆడతాడో లేదో తెలియదని కూడా ద్రవిడ్ పేర్కొన్నాడు.
🗣️ 🗣️ Head Coach Rahul Dravid takes us through the injury status of captain Rohit Sharma, Deepak Chahar & Kuldeep Sen #TeamIndia | #BANvIND pic.twitter.com/r6CEj5gHgv
— BCCI (@BCCI) December 8, 2022