స్వదేశంలో వరల్డ్ కప్ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మరోసారి ఈ వరల్డ్ కప్ భారత్ లో నిర్వహిస్తున్నారు. ఇక స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్ళు దాటిపోయిన టీమిండియాకు ఈ సారి వరల్డ్ కప్ గెలవడానికి ఇదొక సువర్ణావకాశంగానే చెప్పుకోవచ్చు. గత మూడు వరల్డ్ కప్ తీసుకుంటే స్వదేశంలో నిర్వహించిన జట్టే వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ సారి కప్ మన టీమిండియాకే అని అభిమానుల నుంచి ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేయగా కొన్ని జట్లు వరల్డ్ కప్ కి తమ జట్లను కూడా ప్రకటించేసాయి.
సాధారణంగా స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుందంటే ఆతిధ్య జట్టు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇక ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటైన టీమిండియా స్వదేశంలో వరల్డ్ కప్ కొట్టడం గ్యారంటీ అని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా పరిస్థితి చూస్తుంటే అలా కనబడడం లేదు.కీలక ప్లేయర్ల గాయాలతో పాటు సీనియర్ల ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా గత పదేళ్లుగా మన జట్టుకి ఐసీసీ ట్రోఫీ అందినట్లుగానే అనిపించినా నాకౌట్ మ్యాచుల్లో మాత్రం చేతులెత్తేసింది. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మాత్రం రషీద్ లతీఫ్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల భారత్ వరల్డ్ కప్ నెగ్గదని చెప్పుకొస్తున్నాడు. రోహిత్ కి బదులు కోహ్లీ కెప్టెన్ గా ఉండి ఉంటే ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ గెలిచేది అని వ్యక్తం చేసాడు.
లతీఫ్ మాట్లాడుతూ ” చాలామంది వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్ ని టీమిండియా లేకపోతే పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. కానీ నా ఉద్దేశంలో మాత్రం ఈ రెండు జట్లు కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి టాప్ టీమ్స్ని ఫేస్ చేయడంలో చాలా ఇబ్బంది పడతాయి. ప్రస్తుతం ఉన్న జట్టుతో రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలవాలంటే చాల కష్టం. రోహిత్ కి అంత సమయం కూడా లేదు. కానీ ఇదే జట్టుతో కోహ్లీ వరల్డ్ కప్ గెలిపించగలడు. అతనికి బౌలర్లను ఎలా వాడాలో తెలుసు, ఏ ప్లేయర్, ఏ పొజిషన్కి సెట్ అవుతాడో బాగా తెలుసు. 2019 వన్డే వరల్డ్ కప్లో సరైన టీమ్ లేకపోయినా టీమిండియా, గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్గా నిలిచింది. ” అని ఈ పాక్ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. మరి లతీఫ్ చెప్పినట్లుగా రోహిత్ సారధ్యంలో టీమిండియా గెలవడం కష్టమా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.