రాజకీయ పార్టీ, నేతలకు అధికారంతో సంబంధం లేకుండా.. విపక్షంలో ఉన్నా సరే.. నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. అలా కాకుండా మౌనం దాల్చితే.. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయంతోనే వారు ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహించాలి. అలాంటిది అధినేతే మౌనంగా ఉంటే.. తాజాగా ఏపీ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టీడీపీ ఏ అంశంపై కూడా అంత దూకుడుగా వెళ్లడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎక్కడా మీడియాలో కనిపించడం లేదు.
రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం.. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రానికి సీఎంగా పని చేసిన అనుభవం చంద్రబాబు సొంతం. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన పని లేదు. ప్రజా సమస్యల గురించి అధికార పార్టీపై దూకుడుగా ముందుకు వెళ్లాలి. నిత్యం ప్రజల్లో ఉండాలి. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత నుంచి చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. మునుపటి అంతా యాక్టీవ్ గా లేరు అని స్పష్టంగా అర్థం అవుతోంది. దాంతో టీడీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అధినేత మౌనం వెనక కారణాలు ఏంటో తెలిడం లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
ఇది కూడా చదవండి : ఆ భూమి నాదే.. నా స్థలం నాకు ఇప్పించండి
పీఆర్సీ అంశంపై..
కొన్ని రోజులు క్రితం వరకు ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ సమస్య ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిందే. చలో విజయవాడ పేరిట ఉద్యోగులు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోరు బాట పట్టారు. ఉద్యోగుల ఆందోళనతో రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో విపక్షాలు మరింత దూకుడుగా వ్యవహరిస్తాయి. ఉద్యోగులకు మద్దతిచ్చి.. వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ఈ విషయంలో చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఆందోళన కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రం చంద్రబాబు ప్రభుత్వ తీరును ఖండించారు.
భూముల తాకట్టు, కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుపై
ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలోని సుమారు 480 ఎకరాల భూమని హడ్కోకు తాకట్టు పెట్టింది. దీనిపై కూడా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. కొత్త జిల్లాల అంశంపై కూడా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజయవాడ జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పేడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై చంద్రబాబు, లోకోష్, టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే కృష్ణా జిల్లాలో ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ పేరును విజయవాడకు పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి : అంతా కలిసి నన్ను బలి పశువును చేశారు: చింతమనేని ప్రభాకర్!
ప్రత్యేక అజెండాలో హోదా అంశంపై
ఇక రాష్ట్ర విభజన అంశంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనలో ఏపీకి అన్యాయం జరిగింది అన్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో విభజన అంశాన్ని చేర్చి చర్చించేందుకు వైసీపీ మంత్రులను ఆహ్వానించారు. కానీ గంటల వ్యవధిలోనే అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు. ఈ అంశంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు వల్లనే కేంద్రం అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిందని ఆరోపణలు చేశారు. వీటిపై కూడా ఇంతవరకు చంద్రబాబు స్పందించలేదు. ఈ మధ్య కాలంలో బాబు స్పందించిన ఏకైక అంశం.. సినీ ప్రముఖులతో సీఎం జగన్ భేటీ. దీనిపై మాత్రమే చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ సినిమా వాళ్ల పొట్ట కొట్టి.. వారిని బెదిరిస్తున్నారని మాత్రమే ఆరోపించారు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఆయన కనిపించలేదు.
లోకేశ్ కు బాధ్యతలు..?
మరోవైపు వయసు మీద పడటంతోనే చంద్రబాబు మునపటి మాదిరి దూకుడుగా వ్యహరించడం లేదని.. బాధ్యతలను లోకేష్ కు అప్పగించి.. రాజకీయాలకు రిటైర్మెంట్ పలికే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఇంతటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పడు.. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించాలి. ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనా జనాల్లో ఉండాలి. కానీ బాబు మాత్రం మౌనం దాల్చి.. మీడియాకు దూరంగా ఉంటున్నారు. అసలు చంద్రబాబు మదిలో ఏం ఉందో అర్థం కాక.. భవిష్యత్ కార్యచరణ గురించి ఎలాంటి సమాచారం తెలియక కార్యకర్తలు, నేతలు అయోమయంలో ఉన్నారట. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వర్ధంతి రోజే చంద్రబాబుకు కరోనా… విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు