టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారా.. అందుకే ఇలా సొంత పార్టీ, కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేస్తున్నారా అంటే అవుననే వాదనలే బలంగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా పార్టీ వ్యవహాలపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని.. బహిరంగంగానే టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. విజయవాడ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా టీడీపీలో ఎంపీ కేశినేని వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పెద్ద ఎత్తున చర్చకు, రచ్చకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం సోదరుడు చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఆఫ్ ది రికార్డులో భాగంగా కేశినేని నాని మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేలా టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు రావడం పెను దుమారాన్ని రేపింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
తమ్ముడిపై ఫిర్యాదు…
కొన్ని రోజుల క్రితం కేశినేని నాని.. తన పేరు,హోదాను ఉపయోగించుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వ్యవహరాలు సాగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సోదరుడు చిన్ని పేరు చెప్పకుండా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది సృష్టించి, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతు.. తన పేరు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వాహనం నెంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777గా పేర్కొంటూ విజయవాడ పటమట పోలీసులకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు. మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఇదే వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. ఆ వాహనం కేశినేని నాని సోదరుడు చిన్నిది అని తేలడంతో వివాదం ప్రారంభమయింది.
ఫిర్యాదుకు అసలు కారణం అదేనా..
వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె, ప్రస్తుత టీడీపీ కార్పోరేటర్ శ్వేతను తూర్పు నియోజకవర్గం నుండి బరిలో కి దింపాలని కేశినేని నాని భావిస్తున్నారు. అయితే చిన్ని కూడా రేసులోకి రావడంతో ఇప్పుడు సంబంధాలు తెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల చిన్ని కూడా టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న సమాచారం రావడంతో కేశినేని నాని సోదరుడిపై ఆగ్రహం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. నాని ఎన్నికల ప్రచారంలో ఆయన సోదరుడు కేశినేని చిన్ని కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో.. నాని గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
అటు ఢిల్లీలో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఇప్పుడు తాజాగా కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా మరో పోస్టు చేసారు. ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లో వైరల్గా మారింది. అందులో ఆయన.. ‘‘యదార్ధవాది.. లోక విరోధి అనే సామెత గుర్తు వస్తోంది. నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది..’’ అంటూ కేశినేని నాని పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి పోస్టు చేసారు. అయితే, కేశినేని పూర్తిగా పార్టీకి దూరం అవుతున్న క్రమంలోనే ఈ పోస్టులు పెడుతున్నారనే చర్చ సాగుతోంది.
బీజేపీ లేదంటే వైసీపీ..
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని కేశినేని నాని చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, కేశినేని వ్యవహార శైలి.. పార్టీకి దూరంగా ఉంటున్న క్రమంలో టీడీపీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచన మొదలు పెట్టింది. బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న కేశినేని నాని.. టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పార్టీలోనే జరిగింది. అదే విధంగా.. ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన ఎంపీ నాని ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించకుండానే తన ఆగ్రహం బయట పెడుతున్నారు.
పార్టీలో కొందరు నేతల తీరు పైన కేశినేని నాని నేరుగా పలు సందర్భాల్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. అయినా, వీరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటంతో నాని ఆగ్రహంతో ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించటం లేదు. మరి ప్రస్తుతం సాగుతున్న ప్రచారం ప్రకారం కేశినేనీ పార్టీ మారి వైసీపీలోకి వెళ్తారో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.