ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. 5 వేల మీటర్ల ఎత్తులో ఉండే రూప్కుండ్ సరస్సులో మొదటిసారిగా 1956లో 500 అస్థిపంజరాలను గుర్తించారు. 2005 నుంచి సీసీఎంబీ సంస్థ తన పరిశోధనలు ప్రారంభించింది. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత తుది నివేదిక బయటపెట్టారు. అయితే ఇటీవల లాల్జీ సింగ్ మరణించగా అతడి బృందం అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో ప్రచురించారు. ఏటవాలుగా ఉండే ఈ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ‘రూపకుండ్’ సరస్సు ప్రాంతంలో అనేక అస్థిపంజరాల అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
సరస్సు ప్రాంతంలో ఎలాంటి మారయుధాలుగానీ, వాణిజ్య వస్తువులుగానీ బయటపడలేదు. ఈ సరస్సు వర్తక మార్గంలో లేదు. ఎలాంటి అంటు వ్యాధిగానీ, మహమ్మారి గానీ, మరణాలకు కారణం కాగలిగే వ్యాధి కారక బ్యాక్టీరియా ఉనికిగానీ DNA Testలో బయటపడలేదు. “అస్థిపంజరాల సరస్సు” – లేక్ ఆఫ్ స్కెలెటన్స్ – గా పిలిచే ఈ ప్రాంతంలో దొరికిన అవశేషాలపై అర్ధ శతాబ్దానికి పైగా ఆంత్రపాలజిస్టులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.ఈ సరస్సు ఏడాదిలో 11 నెలలు మంచుతో కప్పి ఉంటుంది. మే నెలలో మాత్రమే ఆ సరస్సులో నీరు కనిపిస్తుంది. ఏడాదిలో ఎక్కువ భాగం గడ్డ కట్టుకుపోయి ఉండే ఈ సరస్సు, వాతావరణ మార్పులను అనుసరించి విస్తరిస్తూ, కుంచించుకుపోతూ ఉంటుంది. మంచు కరిగినప్పుడు అస్థిపంజరాలు బయటకు కనిపిస్తుంటాయి. ఇన్నేళ్ల తరువాత కూడా కొన్నింటికి మాంసపు ముద్దలు అతుక్కుని ఉండడం విశేషం. ఈ సందర్భంగా 72 ఎముకలను పరిశీలించారు. సరస్సు నుంచి సేకరించిన అస్థిపంజరాల అవశేషాల్లో సగం భారతీయులవని, మిగతావి గ్రీస్, కిట్రా, మధ్యధరా ప్రాంతం, కిట్రా జాతులకు చెందినవని తెలిసింది. మరొక అవశేషాన్ని ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందినవారిది. రూప్కుండ్ మీదుగా నందాదేవీ దర్శనానికి వెళ్లే భక్తులు, వ్యాపార నిమిత్తం టిబెట్కు వెళ్లే వ్యాపారులు ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని ఈ సరస్సులో పడిపోయి ఉండవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం వేలాది సంవత్సరాల్లో ఎంతమంది బలి తీసుకుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. 9వ శతాబ్దంలో సంభవించిన ఒక విపత్తు కారణంగానే వీరందరూ మరణించారని అంచనా. మరిన్ని టెస్టులతో కొన్ని శతాబ్దాలుగా దాగి ఉన్నఈ మిస్టరీ పూర్తిగా విడిపోయే అవకాశం ఉంది.