మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది.
దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్ వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఇంకో రకం వ్యాప్తిలో ఉంది. ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణాల్లో యూకే రకం వైరస్ ఎక్కువగా ఉంది. బి.1.617 వైరస్ కూడా కనిపిస్తోంది. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో డబుల్ మ్యూటెంట్ రకం విస్తృతి కనిపిస్తోంది. పదిశాతం వరకు ట్రిపుల్ మ్యూటెంట్ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కోవిడ్ థర్డ్ వేవ్ జులై ఆగస్ట్లో మహారాష్ట్రను కుదిపేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే సెకండ్ వేవ్ ధాటికి ఆ రాష్ట్రం వణికిపోతోంది. రాబోయే రెండు నెలల్లో థర్డ్ వేవ్ ప్రభావాన్ని చూడనున్నట్లు ఆరోగ్యమంత్రి బాంబు పేల్చారు. థర్డ్ వేవ్ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని అన్నారు.
సెకండ్ వేవ్ ఉధృతిని అదుపులోకి తీసుకురావడానికి ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. నెల రోజులుగా సెకండ్ వేవ్ తీవ్రత నుంచి కోలుకోలేకపోతున్న ఆ రాష్ట్రంలో జులై ఆగస్ట్ నెలలో థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని ఆరోగ్యమంత్రి రాజేష్ తోపె అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైరస్ విస్తృతిని బట్టి అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతి మే చివరినాటికి గరిష్టస్థాయికి
చేరుకుంటుందని అంచనా వేసారు.