తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సింహాలు సాధారణంగానే ఉన్నాయని, బాగానే ఆహారం తీసుకుంటున్నాయని జూ అధికారులు తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా సందర్శకులను నిలిపివేశారు.
సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానంతో 8 సింహాలకు కోవిడ్ టెస్ట్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులు మూసి వేశారు. అందుకే ఇప్పుడు జూ పార్క్ అధికారులు ఆదివారం నుండి జూ పార్క్ లో సందర్శ కులకు అనుమతి నిరాకరించారు. కరోనా విస్తరణ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్లు, పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేశారు.