మూడేళ్ల క్రితం ప్రపంచం మీదకు వచ్చిన కరోనా.. ప్రజలను ఎంతటి భయభ్రాంతులకు గురి చేసిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహమ్మారి బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. ఎందరో ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. సరిగా చెప్పాలంటే.. కరోనా.. ప్రపంచ అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టింది. ఇక కరోనా కట్టడి కోసం పలు కంపెనీలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశాయి. మనతో పాటు పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా కంట్రోల్లోనే ఉంది. కానీ చైనాలో మాత్రం.. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఇంతలా కృషి చేస్తే.. ఓ అధికారి మాత్రం.. సింపుల్గా యేసుక్రీస్తు దయ వల్ల భారతదేశంలో కరోనా తగ్గింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.. ఆ వివరాలు..
తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు సెమీ క్రిస్మస్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు ప్రసుత్తం వివాదాస్పదంగా మారాయి. క్రిస్టమస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యాం.. మనం చేసిన సేవల వల్ల కాదు. ఆధునిక సంస్కృతి కానీ.. మన దేశానికి కానీ.. మన రాష్ట్రానికి కానీ.. అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులు. ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోలి. లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేది’’ అన్నారు.
క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘‘ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో.. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసిందన్నారు. యేసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా కృషి చేయాలని’’ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్లు వేరు.. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలు వేరు.. ఎందుకంటే.. గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ కోవిడ్ ప్రపంచాన్ని వణికిస్తుంది.. దాన్నుంచి మనం ఇవాళ్టికి పూర్తిగా విముక్తి అయ్యామన్నారు. అయితే కరోనా విముక్తి అనేది.. మనం చేసిన సేవల వల్ల కాదు.. యేసు క్రీస్తు కృప, యేసు క్రీస్తు దైవం దయ వల్ల అని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
శ్రీనివాసరావు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి దైవం మీద భారం వేసి.. ఆఫీస్కు వచ్చి పని చేయలేకపోయావా.. ఆస్పత్రులకు ఎందుకు వెళ్లలేదు.. ఇన్ని కోట్లు పెట్టి వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడం ఎందుకు దండగ అని విమర్శలు చేస్తున్నారు జనాలు. ప్రభుత్వాధికారివై ఉండి ఇలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అంటున్నారు. మరి డీహెచ్ వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.