టీవీ కొంటే రిమోట్ ఇవ్వకుండా ఉంటారా? టీవీ సెపరేట్, రిమోట్ సెపరేట్ అని ఎవరైనా అంటారా? అలానే ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ ఇవ్వడం అనేది కనీస ధర్మం. ఒకప్పుడు సెల్ ఫోన్లు కొంటే ఇయర్ ఫాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇవ్వడం మానేశాయి. సర్లే అని సర్దుకుపోతాం. మరీ ఛార్జర్ కూడా ఇవ్వం, మీ చావు మీరు చావండి అంటే హౌ? ఆ హౌ? ఛార్జర్ ఇవ్వకుండా ఫోన్ కొనుక్కుని ఏం చేసుకోవాలి? అన్ బాక్సింగ్ వీడియోలు చేసుకోవాలా? ఓరి మీ సెల్ ఫోన్ కంపెనీల్లో బాంబు లగా డ్యాష్ డ్యాష్ అని వినియోగదారులు మండిపడుతున్నారు. కొన్ని దేశాల్లో యాపిల్, శ్యామ్ సంగ్, నోకియా వంటి పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లను ఛార్జర్స్ లేకుండానే విక్రయించేస్తున్నాయి. ఇక మా బతుకింతే అనుకునే దేశాలు కొనేసుకుంటున్నాయి.
ఏం అంత రేటు పెట్టి తయారుచేసినోడు ఒక ఛార్జర్ ఇవ్వలేడా అని ఆలోచించే కొన్ని దేశాలు మాత్రం ఆయా కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఛార్జర్స్ లేకుండా ఫోన్లు ఎలా అమ్ముతారంటూ అక్కడ కోర్టులు తెగ యాస్కింగ్ చేసేస్తున్నాయి. ఇప్పటికే బ్రెజిల్ దేశం యాపిల్ కంపెనీ ఫోన్ల విక్రయాలు తమ దేశంలో జరక్కుండా నిషేధించింది. అయినప్పటికీ యాపిల్ అమ్ముతాం అంటూ కోర్టులో అప్పీల్ చేసుకుంది. చివరికి మొట్టికాయలతో పాటు భారీ జరిమానా సమర్పించుకోవాల్సి వచ్చింది. బ్రెజిల్ కి చెందిన జడ్జ్ యాపిల్ కంపెనీకి 19 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. భారత కరెన్సీలో 156 కోట్లు పైమాటే. యాపిల్ కంపెనీ ఛార్జర్లు లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్న కారణంగా గురువారం బ్రెజిల్ జడ్జ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
A Brazilian court fined #Apple Inc. 100 million reais ($19 million) and ruled that battery chargers must come with new #iPhones sold in the country.https://t.co/M6ijXQn1rP
— The Hindu (@the_hindu) October 14, 2022
దుర్వినియోగ ఆచరణ కింద యాపిల్ సంస్థ వినియోగదారులతో బలవంతంగా అదనపు ఉత్పత్తులను (ఛార్జర్లు) కొనేలా ప్రవర్తిస్తుందని భారీ జరిమానా విధించడం జరిగింది. గతంలో బ్రెజిల్ జస్టిస్ మినిస్ట్రీ యాపిల్ సంస్థ తీరుపై మండిపడుతూ.. 2.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ యాపిల్ సంస్థ అప్పీల్ చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడళ్లను ఛార్జర్స్ లేకుండా అమ్మడాన్ని బ్రెజిల్ జస్టిస్ మినిస్ట్రీ కొట్టిపడేయడంతో యాపిల్ సంస్థ అప్పీల్ చేసింది. తాజాగా దీనిపై బ్రెజిల్ ధర్మాసనం తీర్పు ఇస్తూ యాపిల్ సంస్థకు మొట్టికాయలు వేసింది. యాపిల్ కంపెనీ అక్టోబర్ 2020లో కొత్త మోడళ్లకి ఛార్జర్స్ ని నిషేధించింది. ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించింది.
అయితే ఫోన్ కొన్నాక ఛార్జర్ కొనకుండా యూజర్ ఎలా ఉంటాడని? అసలు ఛార్జర్ లేని ఫోన్ ని యూజర్ ఏం చేసుకుంటాడని, ఫోన్ కొన్నాడంటే ఖచ్చితంగా యూజర్ ఛార్జర్ కొని తీరతాడని, అప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్ దుర్వినియోగం జరగదా అని బ్రెజిల్ జడ్జి కారమురు ఆఫోన్సో ఫ్రాన్సిస్కో వెల్లడించారు. అంతేకాదు గత రెండేళ్లలో ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్ ని కొనుగోలు చేసిన బ్రెజిల్ వినియోగదారులందరికీ ఛార్జర్లని సప్లై చేయాలని, అలానే ఛార్జర్లతో కలిపి కొత్త విక్రయాలు ప్రారంభించాలని ఆదేశించారు. 2024 చివరి నుంచి అన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్లు, కెమెరాలు యుఎస్బి-సి పోర్ట్ ప్రామాణికంగా తయారుచేయాలన్న చట్టాన్ని గత వారం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించింది. దీంతో యాపిల్ సంస్థ ఐఫోన్ డిజైన్లలో భారీగా మార్పులు చేయాల్సి ఉంటుంది.
అన్ని కంపెనీలు ఒక రకం ఛార్జర్ పోర్ట్ లను ఫాలో అవుతుంటే.. కొన్ని కంపెనీలు మాత్రం నాన్ టైప్ సి పోర్ట్ లను తయారుచేస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఛార్జర్ కాన్సెప్ట్ వల్ల కొన్ని కంపెనీలకి పెద్ద దెబ్బే పడనుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ కంపెనీ ఒకే రకం ఛార్జింగ్ టైప్ తో విక్రయిస్తుంది. ఇప్పుడు యుఎస్బి-సి పోర్ట్ తో ఫోన్లు తయారుచేయాలంటే యాపిల్ కి పెద్ద తలనొప్పే. అందుకే ఛార్జర్లు లేకుండా ఫోన్లు అమ్మాలని చూస్తుంది. ఆ ఛార్జింగ్ పాట్లేవో కొనుక్కున్న వాడు పడతాడు, మనకెందుకు అన్న చందాన యాపిల్ సంస్థ ప్రవర్తిస్తుంది. ఈ తీరుని వ్యతిరేకిస్తూ బ్రెజిల్ కోర్టు 156 కోట్ల జరిమానా విధించింది. ఒక్క యాపిల్ విషయంలోనే కాదు మిగతా కంపెనీల ఫోన్ల విషయంలోనూ యాక్షన్ తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.