వరకట్నం.. నేటికి కూడా మన జమాజంలో ఆడపిల్లను కనాలంటే.. తల్లిదండ్రులు భయపడేది కట్న పిశాచి గురించే. చదువు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నప్పటికి.. ఇలాంటి దురాచారాల విషయంలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రారంభంలో కట్నాన్ని స్త్రీ ధనం అనేవారు. తల్లిదండ్రులు కుమార్తెపై ప్రేమ, బాధ్యతతో ఇచ్చే ఆస్తి. కానీ రాను రాను అది మగవారి హక్కుగా మారింది. వరకట్న పిశాచాల వేధింపులకు ఎందరో బలవ్వగా.. మరి కొందరు మహిళలు భవిష్యత్తులో తమ బిడ్డలకు ఇలాంటి కష్టం రాకూడదనే ఆలోచనతో.. అసలు ఆడపిల్లలను కనడమే మానేశారు. కుమార్తె అని తెలిసి.. కడుపులోనే పిండాన్ని కరిగించారు చాలా ఏళ్ల పాటు. ఆసలు ఆడపిల్లను కనాలంటేనే ఒణికిపోయారు. మరి ఇప్పుడు నాగరిక సమాజంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందా అంటే లేదు.. నేటికి కూడా వరకట్న వేధింపులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక ఎన్నారై సంబంధాల విషయంలో ఈ కట్నం వేధింపులు మరి కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. కట్టుకున్న వాడి కోసం కన్నవారిని, సొంతగడ్డను వదిలి.. సముద్రాలు దాటి వెళ్తే.. అక్కడకి వెళ్లాక తన మెడలో తాళి కట్టిన వాడు ఓ డబ్బు పిశాచి తెలిసి.. ఏం చేయాలో తెలియక.. ఎవరిని సంప్రదించాలో అర్థం కాక నరకం చూస్తున్నవారు నేటికి కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీలో వెలుగు చూసింది. ఆ వివరాలు..
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రూరల్ మండలం తుమ్మగుంటలో నివాసం ఉంటున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ దంపతులకు సిద్దేశ్వర ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సిద్దేశ్వర్ ప్రసాద్కు గూడూరుకు చెందిన ఓలేటి సోనీతో 2014లో పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం భార్య సోనీని అమెరికాకు తీసుకెళ్లాడు సిద్దేశ్వర్. కొన్నాళ్లు బాగానే కాపురం సాగింది. సంతోషంగా జీవించేవారు. అయితే 2015లో మగబిడ్డకు జన్మనిచ్చింది సోనీ. అనంతరం సోనీని అమ్మగారి ఇంటికి పంపాడు. ఇండియాకి వచ్చిన కొన్నాళ్లు భార్యతో బాగానే మాట్లాడిన సిద్ధేశ్వర్ ఆ తర్వాత క్రమంగా భార్యతో మాట్లాడటం మానేశాడు.
కొన్ని నేలల తర్వాత అనంతరం అదనపు కట్నం కావాలని సోనీని కోరాడు. దీంతో పెళ్లి సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, 12 లక్షల నగదు కట్నం ఇచ్చారని.., 50 లక్షలు పెట్టి పెళ్లిని వైభవంగా చేసినా మళ్లీ ఎలా కట్నం అడగమంటావ్ అని సోనీ ఎదురు తిరిగింది. ఆ నాటి నుంచి మొబైల్ నెంబర్ మార్చేసి భార్యతో అసలు మాట్లాడటం మానేశాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు భర్త కోసం ఎదురు చూస్తున్న సోనీకి షాకింగ్ విషయం తెలిసింది.
భర్త సిద్దేశ్వర్ వేరొక యువతితో వివాహానికిసిద్ధం అయినట్లు బంధువుల వద్ద నుంచి సమాచారం అందుంకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది సోనీ. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేరుగా అత్తగారింటికి వచ్చింది. విషయం తెలుసుకున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ అప్పటికే పరారయ్యారు. దీంతో సోనీ అక్కడే ఆందోళనకు దిగింది. తన భర్త వచ్చే నెల 21న వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. అమెరికాలో మంచి ఉద్యోగం అని కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని సోని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.