వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొరపాటున నోరు జారి చేసిన వ్యాఖ్యలు ప్రసుతం పెను దుమారాన్నిరేపుతున్నాయి. ఏకంగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరలవుతోంది. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా ఒకే గుత్తేదారుకే ప్రాజెక్టులు ఇవ్వలేదు.. ఒకరి దగ్గరే కమీషన్లు తీసుకోలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు.. సోమవారం హైదరాబాద్లోని లోటస్పాండ్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేస్తూ ఆయన ప్రాజెక్టులన్నిటినీ ఒక్కరికే అప్పగించి కమీషన్లు పొందారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో రాజశేఖర్ రెడ్డి.. కేసీఆర్లా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదని, ఒక్క మనిషి దగ్గరే అన్ని కమీషన్లు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
‘‘రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఒక్క మనిషి దగ్గరే అన్ని కమిషన్లు తీసుకోలేదు.’’ ని షర్మిల అన్నారు. ప్రస్తుతం ఈ క్లిప్ విపరీతంగా వైరల్ అయింది. అయితే, వైఎస్ షర్మిల ఇలా ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యానించలేదనే విషయం స్పష్టం అవుతోంది. కేసీఆర్, మేఘా క్రిష్ణారెడ్డి లక్ష్యంగా షర్మిల విమర్శలు చేశారు. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులను ఒకే వ్యక్తికి ఎందుకు కట్టబెడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. మేఘా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారరని ఆరోపించారు. ప్రపంచంలోని సంపన్నుల లిస్టులో ఆయన చోటు సంపాదించుకున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేశారు.
కొత్త వాళ్లకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వడం లేదని షర్మిల నిలదీశారు. ‘‘తెలంగాణ వచ్చింది మెగా కృష్ణా రెడ్డి కోసమేనా.. తెలంగాణను ఆయన చేతుల్లో పెడితేనే రాష్ట్రం ఇస్తామని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా.. రాష్ట్రం మొత్తాన్ని మేఘా కృష్ణా రెడ్డి చేతుల్లో పెట్టడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు. ఒకే వ్యక్తికి 80 శాతానికిపైగా ప్రాజెక్టులా.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలా జరుగుతుందా.. కృష్ణా రెడ్డి దగ్గర రూ.70 వేల కోట్ల బ్లాక్ మనీ ఉంది. దానికి సంబంధించి రూ.12 వేల కోట్లు జీఎస్టీ కట్టాలని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు’’ అని షర్మిల ఆరోపించారు.
మేఘా కృష్ణా రెడ్డితో ఎలాంటి ఒప్పందం లేకపోతే కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను ఆయనకే ఎందుకు ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ ఒకటేనని వ్యాఖ్యానించారు. కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వెళ్తాయని, కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందరూ దోస్తులేనంటూ ఆరోపణలు చేశారు. అందుకే ప్రతిపక్షాలు కూడా ఏమీ స్పందించడం లేదని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనకు కట్టబెట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లోకి నీళ్లు వస్తే అది కట్టిన కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ క్రమంలో పొరపాటున రాజశేఖర్రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఇదిలా ఉండగా.. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో షర్మిల పొరపాటున కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్ ఎవరి దగ్గరా కమీషన్లు తీసుకోలేదు’ అని చెప్పబోయి.. అలా అన్నారంటూ వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.