ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ తాజాగా ప్లీనరీ నిర్వహించింది. చాలాకాలం తర్వాత నిర్వహించిన ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జన సముద్రం కనిపించింది. అదే సమయంలో పార్టీ ప్లీనరీ కీలక నిర్ణయాలకు కూడా వేదికైంది. ఇదంతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. వైసీపీ తొలిసారి అదికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం తిరిగి కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇది పనికొచ్చింది. అయితే ప్లీనరీ వేదికగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో షర్మిల ఒంటరిగా పోరాడుతుందని.. ఆమెకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించి.. ప్లీనరీ వేదిక మీదుగానే విజయమ్మ రాజీనామా ప్రకటన చేశారు. అయితే విజయమ్మ రాజీనామా ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. తల్లిని, చెల్లిని దూరం పెట్టి.. జగన్ సాధించేది ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మహారాష్ట్ర తరహా పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరి కొందరు అభిప్రాయపడ్డారు. కానీ మెజారిటీ వ్యక్తులు మాత్రం.. ఒకవేళ అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లే పరిస్థితులు వస్తే.. సీఎంగా భార్య భారతి రఉండాలని.. అందుకు షర్మిల అడ్డు అవుతుందని.. అప్పుడు విజయమ్మ షర్మిలకే మద్దతు ఇస్తారనే ఉద్దేశంతోనే.. వారిద్దరని దూరం పెట్టాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై, విజయమ్మ రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసుత్తం అవి నెట్టింట వైరల్గా మారాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన బదులుగా సీఎం స్థానంలో షర్మిల వస్తుంది. విజయమ్మ కూడా అందుకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆమెకు అవకాశాలు ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ తల్లిని, చెల్లిని పార్టీ నుంచి బయటకు పంపించాడు’’ అని తెలిపారు. అంతేకాక తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ స్థాపన గురించి కూడా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: YS Vijayamma: YCP గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా! ‘‘జగన్ ఏపీలో పార్టీ పెట్టిన ప్రారంభంలోనే తెలంగాణలో కూడా పార్టీ పెడితే.. మేం చూసుకుంటాం అని జగన్కు సూచించాం. కానీ వినలేదు. తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. అన్నతో విబేధాలు వచ్చిన తర్వాత షర్మిల పార్టీ పెట్టింది. ఆమెను ఎవరు నమ్ముతారు. అన్నతో పార్టీలో విబేధాలు, ఆస్తుల విషయంలో గొడవ జరిగి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తెలంగాణలో పార్టీ పెట్టింది. ఈ విషయంలో నేను ఆమెను తప్పుపడుతున్నాను. తండ్రి ఆశయాల కోసం పార్టీ పెట్టాను అంటుంది. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు.. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు ఒకటే. మరి అలాంటప్పుడు.. కాంగ్రెస్లో చేరి పార్టీని బలోపేతం చేయాలి.. కానీ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి’’ అని కొండా సురేఖ ప్రశ్నించారు. ‘‘షర్మిల పార్టీ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లు చీలవు.. కానీ టీఆర్ఎస్ ఓట్లు చీలుతాయి. కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర్రెడ్డి అభిమానులు షర్మిలకు ఓట్లు వేసే అవకాశం ఉది. దీని వల్ల టీఆర్ఎస్కు లాభమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. మరి కొండా సురేఖ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: తండ్రికి వైఎస్ షర్మిల నివాళి! YSR మనవడు రాజారెడ్డి ఫోటోలు వైరల్!