ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ. ఇక ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అంటోంది జనసేన. ఆయా పార్టీలు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో కడపలో పాలిటిక్స్ భిన్నంగా మారుతున్నాయి. వివేకా హత్య తరువాత ఇక్కడ రాజకీయం కన్నా.. ఆరోపణల పర్వం ఎక్కువ అయ్యింది. ఒకవైపు ఈ కేసు కోర్టులో ఉన్నా.. రాజకీయ ప్రత్యర్ధులు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వివేకా హత్యకి కడప ఎంపీ సీటు ప్రధాన కారణమై ఉండవచ్చని షర్మిల సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఓ వార్తని తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి సిబిఐ ఛార్జ్ షీట్, అందులో సాక్ష్యులు స్టేట్మెంట్ అంతా కోర్టు పరిధిలో ఉన్న అంశం. కాబట్టి.. దానిపై చర్చను పక్కన పెడితే.. 2019 ఎన్నికలకు ముందునాటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వై.ఎస్. కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రామ్ చేసిన ఇంటర్వ్యూ అది. అందులో కడప ఎంపీ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు షర్మిల ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యాంకర్ మాట్లాడుతూ.. ” 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానంలో షర్మిల నిలబడాలని ఉత్సాహంగా ఉంటే.. అధిష్టానం అందుకు ఒప్పుకోలేదని, అందుకే.. మీకు, మీ అన్నకు మధ్య మనస్పర్థలు వచ్చాయని, మీడియా కోడై కూస్తోంది! మీరెందుకు దీనిపై స్పందించలేదు” అన్న ప్రశ్న షర్మిల ముందు ఉంచారు. దీనికి సమాధానంగా షర్మిల.. “నేను ఎప్పుడూ ఆ స్థానంపై ఆశ పడలేదు. కడప లోక్ సభ సీటు అవినాష్కు ఇవ్వాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అవినాష్ నాకు తమ్ముడు. తన గురించి బాగా తెలుసు. పాదయాత్ర సమయంలో ప్రతిరోజు నాతో నడిచాడు. అతనికి వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించి అవగాహన ఎక్కువ. పైగా.. కడపలో అవినాష్ నివసిస్తున్నాడు. అతను లోకల్. ఆ సీటుకు తగినవాడు. అవినాష్ కడప ఎంపీ అయితే నాకు ఏం అభ్యంతరం లేదు. వాస్తవానికి నా ప్రేయర్స్ కూడా ఉన్నాయి”. అని షర్మిల రిప్లయ్ ఇచ్చారు.
ఒకవేళ సిబిఐ ఛార్జ్ షీట్ లో షర్మిల నిజంగానే.. కడప ఎంపీ సీటే వివేకా హత్యకి కారణమని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. ఈ వీడియోలో అలా ఎందకు చెప్పినట్టు అని వైసీపీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం షర్మిల అసలు ఆ సీటు కోసం ఏ మాత్రం ఆశపడలేదని, ఆమె ఇష్టపూర్వకంగానే కడప లోక్ సభ స్థానానికి అవినాష్ రెడ్డిని అంగీకరించినట్లు అర్థమౌతూనే ఉంది. మరి.. మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్ వేయండి.