టి.ఆర్. ఎస్.. ఒకప్పటి ఉద్యమ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన రాజకీయ పార్టీ. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న చాలా నిర్ణయాలు టి.ఆర్.ఎస్ ని రాజకీయంగా బలోపేతం చేశాయి. అయితే.., ఇప్పుడు టి.ఆర్.ఎస్ లో అసమ్మతి సెగలు ఎక్కువ అయ్యాయి. వాటిని కేసీఆర్, కేటీఆర్ ద్వయం ఎక్కడికెక్కడ అణిచేసే ప్రయత్నాలు చేస్తున్నా.., సమస్య మాత్రం చాప కింద నీరులా అలా ఎక్కువ అవుతూనే వస్తోంది. కారణాలు ఏవైనా తనకి నచ్చని వాళ్ళని కేసీఆర్ ఒక్కసారిగా దూరం పెట్టేస్తారు. ప్రొఫెసర్ కోదండరామ్, హరీష్ రావు, రాజయ్య, డీ. శ్రీనివాస్, విజయశాంతి, ఇలా ఒక్కరేంటి ఆ లిస్ట్ చాలా పెద్దదే. కానీ.., అధికారం వచ్చాక మాత్రం ఒక్క హరీష్ రావు విషయంలో తప్పించి మిగతా అందరిని కలుపుకునే పోతూ వచ్చాడు కేసీఆర్. హరీష్ కూడా ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో అంతగా వ్యతిరేకత ఏర్పడలేదు. కానీ.., ఇప్పుడు మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అరెస్టు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో టి.ఆర్. ఎస్ నాయకుల్లో పార్టీపై విశ్వసనీయత పోయిందన్న టాక్ వినిపిస్తోంది. తమకి అవసరమైనన్ని రోజులు ఉంచుకుని, అవసరం తీరిపోయాక కేసులు పెట్టి బయటకి పంపిస్తే ఎలా అన్న చర్చ పార్టీ నేతల్లో ఎక్కువైందన్న టాక్ వినిపిస్తోంది. ఉద్యమంలో కేసీఆర్ తో పాటు కలసి నడిచిన ఈటల రాజేందర్ కే ఈ పరిస్థితి తప్పకుంటే .., ఇక తాము ఎంత అన్న అభద్రతా భావం నాయకుల్లో కనిపిస్తోంది.
నిజానికి కేసీఆర్ ఆలోచనా విధానం మారడానికి కారణం గత ఏడాదిలో జరిగిన దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ కుదుపునకు లోనైంది. తెలంగాణలో ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడంతో సుమారు రెండు నెలలపాటు టి.ఆర్.ఎస్ పట్టు వీడిపోయిన పరిస్థితిలు కనిపించాయి. కానీ.., కేసీఆర్ వెంటనే తన వ్యూహాలకి పదును పెట్టారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’ స్థానాన్ని టి.ఆర్. ఎస్ దక్కించుకుంది. ఇక బీజేపీ సిట్టింగ్ స్థానం ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇవన్నీ కాకుండా సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ కి డిపాజిట్ కూడా రాకుండా చేయడంలో కేసీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక అక్కడ నుండి పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఈటల పై గురి పెట్టాడన్న టాక్ వినిపిస్తోంది. ఈటల ఎపిసోడ్ తో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిదులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం అందరిలో ఒక క్రమశిక్షణ తీసుకుని రావచ్చని కేసీఆర్ భావించాడు. కానీ.., ఇక్కడే పరిస్థితి చేజారింది. ఈటలకి భారీ స్థాయిలో సొంత పార్టీ నుండే మద్దతు లభిస్తోంది. ఒక్కొక్కరిగా ఇప్పుడు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. సో.. ఈ లెక్కన చూసుకుంటే గులాబీ గూటిలో గుబులు మొదలైనట్టే. మరి.. ఈ అసంతృప్తిని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.