త్వరలో ఏపీలో ఉప ఎన్నిక నగరా మోగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే దీని గురించి ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి స్థానంలో.. ఆయన భార్య శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఉప ఎన్నికలో విపక్షాలు కూడా పోటీ చేయవు కాబట్టి.. ఏకగ్రీవం కానుంది. శ్రీకీర్తి రెడ్డి అభ్యర్థిత్వం గురించి వారి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత సీఎం జగన్ ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది.
ఇక ఆత్మకూరు ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీ కీర్తి రెడ్డి పోటీ చేస్తారని.. అందరూ భావిస్తుండగా.. తాజాగా వెలుగు చూసిన ఓ వార్త విపక్షాలతో పాటు పార్టీ కేడర్ ని కూడా విస్మయపరుస్తోన్నట్లు తెలుస్తోంది. అందేంటి అంటే.. ఆత్మకూరు ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి స్థానంలో.. ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డిని పోటీకి నిలపాలని జగన్ భావిస్తున్నారట. దీని గురించి మేకపాటి కుటుంబ సభ్యులతో ఇప్పటికే చర్చిస్తున్నారని.. త్వరలో ఈ మేరకు ప్రకటన చేస్తారని సమాచారం. పట్టుమని పాతికేళ్లు కూడా లేని కృష్ణార్జున్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురానున్నారనే వార్త.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి : ఆ జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ! ఈసారి జగన్ కి కష్టమేనా!
మేకపాటి కుంటుంబంతో సీఎం జగన్ కి ప్రత్యేక అనుంబంధం ఉంది. తండ్రి వైఎస్సార్ మృతి తర్వాత.. జగన్ పార్టీ స్థాపించిన సమయంలో మేకపాటి కుటుంబం ఆయనకు మద్దతుగా నిలిచింది. గౌతమ్ రెడ్డి జగన్ కోసం తన కెరీర్ ని పణంగా పెట్టి.. జగన్ తో నడిచి.. వైఎస్సార్ కుటుంబం పట్ల తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. గౌతమ్ రెడ్డి ని జగన్ సోదరుడిగా భావిస్తారు. ఆయన అంత్యక్రియల్లో జగన్ కన్నీటి పర్యంతం అయ్యారు. గౌతమ్ రెడ్డితో తనకున్న ప్రత్యేక అనుంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. జగన్, ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డిని తీసుకురావాలని.. జగన్ భావిస్తున్నారట. ఉప ఎన్నికలోనే కాక.. వచ్చే సార్వత్రిక ఎన్నికలో కూడా గౌతమ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డిని పోటీ చేయించాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డిని తనకు అప్పగిస్తే.. తండ్రిని మించిన తనయుడిలా రాజకీయాల్లో తీర్చిదిద్దే బాధ్యత తనదే అని జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులకు తెలిపారట. ఇందుకు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటనే అంటున్నారు విశ్లేషకులు. మేకపాటి కుటుంబానికి వైఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్నపుడు జగన్ కి అండగా నిలిచారు. అలాంటి కుటుంబం నుంచి బలమైన నేత లేకపోతే.. భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆనం రామనారాయణరెడ్డి బలంగా నిర్ణయించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారి అయినా సరే.. ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో బలమైన నేత లేకపోతే గ్రూపు రాజకీయాలు పెరిగి.. పార్టీకి పెద్ద తలనొప్పిగా మారతాయని జగన్ భావిస్తున్నారట.
ఇది కూడా చదవండి : గౌతమ్ రెడ్డి కోసం మేకపాటి కుటుంబం సంచలన నిర్ణయం!
ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి రెడ్డిని బరిలో నిలిపితే.. విజయం సాధిస్తారు.. కానీ భవిష్యత్తులో పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. గౌతమ్ రెడ్డి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని జగన్ బలంగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మేకపాటి కుటుంబం నుంచి బలమైన నేత ఉండటం పార్టీకి ఎప్పటికైనా కలిసి వచ్చే అంశమే కనుక.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం కృష్ణార్జున్ రెడ్డి విదేశాల్లో చదువుతున్నాడు. అది పూర్తికాగానే.. అతడిని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తీసుకురావాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.