ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాపట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జగనన్న విద్యాదీవెన’ మూడవ విడత నిధులను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని జగన్, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 11.02 లక్షల మంది విద్యార్థులకు గాను రూ. 694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య ఒకటే అని, విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అందులో భాగంగానే అర్హులైన ప్రతీ పేద విద్యార్థికీ ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటివరకూ రూ. 11,715 కోట్లు నేరుగా లబ్దిదారులకు అందించామని అన్నారు.
అమ్మ ఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్దా, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజ్యూస్ తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్ళలో రూ. 53 వేల కోట్లు ఖర్చుపెట్టామని అన్నారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పిల్లలకి మంచి శిక్షణ అందించడం కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. పిల్లల చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదని, ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి అని జగన్ అన్నారు. పెద్ద చదువులు పేదల హక్కు అని, ప్రతీ ఇంటి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐపీఎస్ లు రావాలని అన్నారు. మరి ‘జగనన్న విద్యాదీవెన’ మూడో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.