కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోశ్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోశ్ బాబు సహా 20 మంది వరకూ సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కల్నల్ సంతోష్ బాబు పోరాట స్ఫూర్తికి కేంద్రం గుర్తించి దేశంలో అత్యున్నత పురస్కారమైన మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. సంతోశ్ బాబు మరణించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు, బంజారాహిల్స్లో ఇంటి స్థలం, సంతోశ్ బాబు సతీమణికి గ్రూపు 1 స్థాయి ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ఇకనుండి ఆ చౌరస్తా పేరు కూడా సంతోష్ బాబు చౌరస్తాగా మార్చినట్టు కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్నిచ్చిందన్నారు.
కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషిని మాట్లాడుతూ., భారత్ చైనా సరిహద్దుల్లో భర్త సంతోష్ బాబు వీర మరణం పొందడాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. పిల్లల భౌష్యత్తు కోసం భరోసా ఇచ్చారు, గౌరవ ప్రదమైన ఉద్యోగం కల్పించారు, ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటూ ధైర్యం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు.