దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి 27) లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఐదోసారి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా పెంపుతో రాజధాని డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.11, డీజిల్ రూ.90.42 కి చేరుకున్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.113.88, డీజిల్ రూ.98.13గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.104.90గా.. డీజిల్ రూ.95.00 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.112.35, లీటర్ డీజిల్ ధర రూ.98.68కి చేరుకున్నాయి. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ రూ.113.08, డీజిల్ రూ.99.09 వద్ద కొనసాగుతోంది.
పెట్రోలు, డీజిల్ రేట్లలో మార్పు చేయకపోవడం వల్ల ఇంధన రిటైలర్లయిన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లకు 2.25 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.19,000 కోట్ల) నష్టం వాటిల్లినట్లు సమాచారం. గత ఆరు రోజులుగా పెట్రో ధరలపై బాదుడు మొదలైంది. ఇప్పటివరకు లీటర్ పెట్రల్ పై రూ.3.70, డీజిల్ రూ. 3.75 వరకు పెరిగింది. త్వరలో ఇంధన ధరలు 120 నుంచి 125 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరి పెరుగుతున్న ఇంధన ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.