ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికే వెంటనే లోన్ ప్రక్రియ పూర్తవ్వదు. అందుకోసం చాలా సార్లు బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉండి కూడా లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా అప్లై చేసి 15 రోజుల్లోనే ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. తక్కువ వడ్డీకే విద్యా రుణాన్ని అందించే పథకం ఒకటి ఉంది. అదే విద్యాలక్ష్మి పథకం.
డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటారు. కానీ ఆర్థిక స్థోమత కారణంగా కలలు కలలుగానే మిగిలిపోయే పరిస్థితి. అయితే ఇలాంటి వారికి దొరికిన వరమే విద్యాలక్ష్మి పథకం. విద్యార్థులకు అతి తక్కువ వడ్డీకి సులువుగా.. ఎలాంటి హామీ లేకుండా ఈ రుణాన్ని పొందవచ్చు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ను ప్రారంభించింది. ఎలాంటి హామీ అవసరం లేకుండా.. తక్కువ వడ్డీకి విద్యార్థులకు సులభంగా ఎడ్యుకేషన్ లోన్ అందించాలన్న ఆలోచనతో ఈ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ లోన్ ని పొందాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే మూడు బ్యాంకుల్లో మూడు రకాల ఎడ్యుకేషన్ లోన్లకి దరఖాస్తు చేసుకున్నట్టు లెక్క. ఇందులో మూడు రకాల రుణాలు ఉంటాయి. రూ. 4 లక్షల లోపు ఋణం ఒకటి, రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల లోపు వరకూ మరొకటి, రూ. 7.5 లక్షల పైన మరొక ఋణం. బయట బ్యాంకుల్లో తీసుకునే రుణాలతో పోలిస్తే ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా తీసుకునే విద్యా రుణానికి వడ్డీ చాలా తక్కువ. ఈ ఋణం పొందాలంటే విద్యార్థి యొక్క కుటుంబ వార్షికాదాయం రూ. 4.50 లక్షల లోపు ఉండాలి.