మూడేళ్ళ వయసున్న చిన్నారిని జర్మనీ ప్రభుత్వం తమ కస్టడీలోకి తీసుకుంది. తమ బిడ్డను తమకు ఇప్పించండి అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అసలు కస్టడీలో పెట్టేంత తప్పు ఆ చిన్నారి ఏం చేసింది? అసలేం జరిగింది?
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన దంపతులు బతుకుతెరువు కోసం 2018లో బెర్లిన్ వెళ్లారు. అక్కడ ఉండగానే వీరికి ఒక పాప పుట్టింది. అయితే పాపకు నెలల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేట్ పార్ట్ వద్ద గాయమైంది. స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. చిన్నారి ఆరోగ్యం బానే ఉందని ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా చేశారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి కాల్ చేసి పాపకు చెకప్ చేయాలని, ఒకసారి తీసుకురావాలని అన్నారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే వైద్యులు శిశు సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి వచ్చి తల్లి ఒడి నుంచి పాపను తీసుకెళ్లిపోయారు. జర్మనీలో పుట్టింది కాబట్టి పాప సంరక్షణ బాధ్యత తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని అధికారులు చెప్పారు.
అప్పటికి చిన్నారి వయసు ఏడాదిన్నర. ఇప్పుడు పాప వయసు మూడేళ్లు. ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా గానీ తల్లిదండ్రులకు న్యాయం జరగడం లేదు. పాప ప్రస్తుతం జర్మనీ కష్టడీలోనే ఉంది. చిన్నారికి ప్రైవేట్ భాగంపై గాయం అయిన కారణంగా పాపపై లైంగిక దాడి జరిగిందన్న అనుమానంతో పాపను కస్టడీలోకి తీసుకున్నారని చిన్నారి తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే 2022 ఫిబ్రవరిలోనే లైంగిక వేధింపుల కేసు మూసేశారు. ఈ కేసులో డీఎన్ఏ నమూనాలు ఇచ్చినట్లు పాప తల్లిదండ్రులు వెల్లడించారు. 2021 డిసెంబర్ లో పాపపై లైంగిక వేధింపులు జరగలేదని ఆసుపత్రి నివేదికలు ఇచ్చిందని, వీటిని తీసుకుని పాప జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారుల దగ్గరకు వెళ్లామని, కానీ వారు తిరిగి మాపైనే కేసు పెట్టారని అన్నారు. కోర్టుకు వెళ్లామని, అయితే కోర్టు పిల్లల్ని పెంచే సమర్థతను నిరూపించుకోవాలని ఆదేశించిందని తెలిపారు. ఆ పరీక్షల్లో సైకాలజిస్టు 12 గంటలు తమతో మాట్లాడి తమకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడంటూ పాప తండ్రి వాపోయారు.
తమ పాపను భారత్ కి పంపించేందుకు అక్కడి అధికారులు అంగీకరించడం లేదని, కనీసం చూసే భాగ్యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. నెలకు ఒకసారి కేవలం ఒక గంట మాత్రమే పాపని చూసేందుకు అనుమతి ఇస్తున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషయంపై తాము కోర్టుకు వెళ్లామని, నెలలో రెండు సార్లు చూసేలా కోర్టు అనుమతి ఇచ్చినా అక్కడి అధికారులు చూడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరస్తులను కూడా చూసేందుకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తారని.. కానీ మా బిడ్డను క్రిమినల్ కంటే కూడా దారుణంగా చూస్తున్నారని తల్లి వాపోయారు. ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని న్యాయపోరాటానికి దిగారు. విదేశంలో న్యాయం దొరక్కపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు స్వదేశానికి చేరుకున్నారు.
ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు చెప్పుకున్నారు. భారత ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని, తమ పాపను ఎలాగైనా జర్మనీ నుంచి తమకు ఇప్పించాలని ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ను వేడుకుంటున్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే తమ బిడ్డ తమకు తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ళ పాప ఏడాదిన్నరగా జర్మనీ కస్టడీలో తమకు దూరంగా ఉంటుందంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించడం కష్టం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటి? ప్రధాని మోదీ జోక్యంతో ఆ పాప భారత్ కి తిరిగి వస్తుందా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.