మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బావిలో పడిన ఓ చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన 40మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 23 మందిని కాపాడారు. ఇటు రాత్రి 11 గంటల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు పోలీసులు కూడా అందులో పడ్డారని అక్కడి వారు చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల మేర నీళ్లున్నాయని అంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు19 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ ఆఫీసర్ భరత్ భూషణ్ శర్మ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు.ఈ ఘటన విధిషా జిల్లాలో చోటుచేసుకుంది.
గుంజ్బసోడ గ్రామంలో రాత్రి 9గంటల ప్రాంతంలో ఓ ఎనిమిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు ఓ బావిలో పడింది. ఆ బావి సుమారు 50 అడుగుల లోతు ఉండగా 20 అడుగుల వరకు నీరు ఉంది. బాలిక బావిలో పడిపోయింది అని తెలియగానే స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్నఎన్డీఆర్ఆఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి.
ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ చిన్నారి ఇంకా బావిలోనే ఉన్నదని, ఆమెకు గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది’ అని మోడీ ట్వీట్ చేశారు.