దేశంలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాలుగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వల్ల వందల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తమ కళ్ల ముందే బాధితులు గిలగిలా కొట్టుకుని ఊపిరి ఒదులుతుంటే వైద్యులు ఏమీ చేయలేని నిస్సాహాయులుగా చేష్టలుడిగిపోతున్నారు. ఈ సన్నివేశాలు వారిలో తీవ్ర నిరాశకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వివేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కరోనా వేళ వందలాది మందికి సేవలందించిన ఓ యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడు వివేక్ రాయ్ కోవిడ్ రెండో దశ వ్యాప్తి వేళ తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ చీఫ్ డాక్టర్ రవి వాంఖేడక్కర్ ట్విట్టర్లో వెల్లడించారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన వివేక్ చాలా ప్రతిభావంతుడు. మహమ్మారి వ్యాప్తి సమయంలో వందల మంది ప్రాణాలను రక్షించాడు’’ అని అన్నారు.