దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. దీపావళి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో దీపోత్సవ్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంబరాన్ని తాకే విధంగా సంబరాలు జరిపారు.
ఆదివారం రాత్రి సరయు నది తీరంలో దీపోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అయోధ్యకు చేరుకున్న మోదీ.. ముందుగా రాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ మందిరం కోసం భూమి పూజ చేసిన రామాలయాల్లో పూజలు చేసి.. శ్రీరామా జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ పనులను సమీక్షించారు. అనంతరం శ్రీరాముని పట్టాభిషేకంలో పాల్గొని సీతారాములకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత మోదీ సమక్షంలో బాణాసంచా, లేజర్ షో, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, రామ్ లీలా వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రతి ఏటా దీపావళికి ముందు రోజు అయోధ్యలో దీపోత్సవ్ వేడుక నిర్వహిస్తారు. గత ఆరేళ్లుగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. దీపోత్సవ్ వేడుకలో భాగంగా అయోధ్య నగరాన్ని మట్టి దీపాలతో అలంకరించారు. రామ మందిరంతో పాటు సరయు నది తీరంలో కూడా దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవ్ వేడుకలో భాగంగా అవధ్ యూనివర్సిటీకి చెందిన 22 మంది వాలంటీర్లు.. రామ్ కి పైడి వద్ద 15 లక్షల 76 వేల మట్టి ప్రమిదలు వెలిగించి అబ్బురపరిచారు. ఈ ప్రమిదలు వెలుగులతో అయోధ్య నగరం అత్యంత శోభాయమానంగా మారిపోయింది. యావత్ ప్రపంచానికే వెలుగులు పంచిన ఈ అయోధ్య దీపోత్సవ్ వేడుకకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. అయోధ్య నగరాన్ని 15 లక్షలకు పైగా మట్టి ప్రమిదలతో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖకు దక్కిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని ప్రధాని మోదీ చేతుల మీదుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు.