అనురాగానికి అర్థం అమ్మ మమతకు మారు పేరు అమ్మ ప్రేమకు ప్రతిరూపం అమ్మ . ‘‘అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే’’ అన్నారు మనసు కవి ఆత్రేయ. నిస్వార్థ్ధమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. ఆమెకు బిడ్డ ఆకలి తప్ప తన ఆకలి తెలియదు. అందుకే అమ్మ త్యాగమూర్తి. తల్లంటే తొమ్మిదినెలల లెక్క మాత్రమేనా?.. చిరకాల దీవెన కూడా. తన కడుపున పుట్టని వారికీ మాతృత్వపు మాధుర్యం పంచగల ప్రేమమూర్తి అమ్మ. అందుకే మానవాళి మనుగడంతా అమ్మతనంపై విరాజిల్లుతోందని కవులు, పండితులు అభివర్ణించారు. హెనెన్ ప్రావీన్స్లో నివసిస్తున్న మెంగ్ కూడా ఓ అమ్మే. స్కూల్కు వెళ్లే తన కొడుకు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడా లేదా అని ఆందోళన చెందేది. ఎందుకంటే ఆ మార్గంలో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. పైగా ఆ మార్గంలో పిల్లలు రోడ్ దాటేందుకు కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. ఆ మార్గంలో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. దీంతో తన కొడుకు ఇంటికి వచ్చేసరికి షూలు తడిచిపోయేవి. కాళ్లు తెల్లగా పాలిపోయేవి.
తల్లిదండ్రులు చాలాసార్లు అధికారులు తమ సమస్యను విన్నవించుకున్నారు. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి్ నిర్మించాలని కోరినా స్పందన లేదు. దీంతో ఆమే స్వయంగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించుకుంది. ఆ వంతెనల కోసం మెంగ్ హౌసింగ్ అండ్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అధికారుల అనుమతి తీసుకుంది. స్కూలుకు వెళ్తున్న తన బిడ్డ కోసం ఆమె ఏకంగా రెండు వంతెనలు నిర్మిస్తోంది. ఈ మేరకు 154,000 యువన్(భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) ఖర్చు పెట్టింది. ఈ వంతెనకు ‘విజ్డమ్ బ్రిడ్జ్’ – వివేకమైన వంతెన – అని పేరు పెట్టానని తెలిపింది. ఈ వంతెన మీద రాకపోకలు చేసే విద్యార్థులు చదువుల్లో తెలివిగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపింది. మెంగ్ చేస్తున్న మంచి పని గురించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజనులు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. కొడుకు కోసం నిర్మిస్తున్న ఆ వంతెన.. మిగతా పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని, తల్లిదండ్రులంతా ఆమెకు రుణపడి ఉండాలని అంటున్నారు. ఆమె ఆ వంతెన కోసం వెచ్చిస్తున్న మొత్తంతో మంచి భవనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఆమె నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడే వంతెన నిర్మించని కొనియాడుతున్నారు.