ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా, పురుష నర్సు లకు జీతాలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరోనా నియంత్రణ, నివారణ, చికిత్సలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను వెంటనే పెంచాలని ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్య శాఖను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా బెడ్ల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లలో తప్పనిసరిగా 3 వేల బెడ్లు ఉండాలని, ఆక్సిజన్ బెడ్లు 1,000, నాన్ ఆక్సిజన్ బెడ్లు 2,000 తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
ఏ ఆస్పత్రిలోనూ (ప్రభుత్వ ఎం ప్యానెల్) కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడాలని, కోవిడ్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల జీతాలు పెంచాలని స్పష్టం చేశారు. రోగులకు వైద్య సేవల్లో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేసి, టీచింగ్ ఆస్పత్రులతో పాటు ఇతర ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. టీచింగ్ ఆస్పత్రుల వద్ద 10 కేఎల్ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఉండాలి. వీలైనంత త్వరగా ఇవన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.