ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నయాలు వెతికే పనిలో ఉన్నాయి కొన్ని దేశాలు. దీనిలో భాగంగా బయో డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో కూడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మన దగ్గర ఎలక్ట్రిక్ బైక్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ దేశం మాత్రం పెట్రో సమస్యల నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. పెట్రో సమస్యకు పరిష్కారంగా పామాయిల్ను ఎంచుకుంది. ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించింది. ఆ వివరాలు..
ఇండోనేషియా ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఇండోనేషియా కూడా ఇంధన కొరతకు ప్రత్యామ్నాయం వైపు యోచన చేసింది. అక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే పామాయిల్తోనే ఇంధన సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే డీజిల్లో పామాయిల్ కలుపుతుండగా.. దానిని మరింతగా పెంచింది. ఏకంగా 40శాతం పామాయిల్ కలపాలని నిర్ణయించింది. దీనిపై ఈ నెల 27న నుంచి ప్రయోగాలను ప్రారంభించింది. ప్రపంచంలోనే పామాయిల్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండోనేసియా మొదటి స్థానంలో ఉంది. మనదేశం కూడా చాలా వరకు పామాయిల్ను ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశ ఆదాయంలో కూడా దీని వాటానే ఎక్కువగా ఉంది.
అయితే పామాయిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చమురు నిల్వలు మాత్రం ఇండోనేసియాలో లేవు. అందుకు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతుండడంతో.. ఆ ఖర్చును తగ్గించుకునేందుకు పామాయిల్ను ఉపయోగిస్తోంది ఇండోనేసియా. ఈ క్రమంలో బుధవారం నుంచే పామాయిల్ బయో డీజిల్ వాహనాలను తిప్పడం ప్రారంభించారు అక్కడి అధికారులు.
ట్రయల్ రన్ తర్వాత ఇంజిన్ పనితీరు, టార్క్, ఇంధన వినియోగం, కర్భన ఉద్గార వివరాలను పరిశీలిస్తారు. తద్వారా పామాయిల్తో నడిచే వాహనాలు ఎంత మేరకు ఉపయోపడతాయో ఈ ఏడాది లోగా చెప్పాలని అధికారులను ఇండోనేషియా ప్రభుత్వం ఆదేశించింది. వారి సమర్పించే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.