ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు నింపుతున్నాయి. నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ఈ దారుణ ఘటనలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో పది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలోనే కుప్పకూలిపోయింది. దాంతో మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్నవారంతా కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. దీంతో ప్రయాణీకుల కుటుంబాల్లో విషాదం నిండింది.
విమాన ప్రమాదంలో 53 నెపాలీలు, ఐదుగురు భారతీయులు మరికొన్ని దేశాలకు చెందిన వారు ఉన్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంతో ప్రయాణించిన వారు అకస్మాత్తుగా మృత్యువడిలోకి చేరిపోయారు. ఈ విమాన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా చంత్యాల్ కూడా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఓ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు ఫొఖారా కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి ముందే నీరా చంత్యాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. నీరా చంత్యాల్ మృతి చెందినట్లు ఆమె సోదరి హీరా చంత్యాల్ షెర్చన్ ధృవీకరించారు.
నీరా చంత్యాల్ నేపాల్ లోని బగ్ లుంగ్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది. చిన్న నాటి నుంచి జానపద గీతాలు పాడుతూ నతకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. గాయనిగా పాపులర్ అయ్యాక నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో ఉంటుంది. తన మధురమైన గానంతో లక్షలాది అభిమానులను సంపాదించింది. ఈ క్రమంలో ఫొఖారా కు వెళ్తున్న సమయంలో నేపాల్ సంప్రదాయాన్ని ప్రతిబింబించే వేషధారణతో వెళ్లింది. కానీ విధి వక్రించి ఆమె ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై కన్నుమూసింది. ఆమె మరణంతో మాఘ్ సంక్రాంతి ప్రోగామ్ ని క్యాన్సిల్ చేసినట్లు నిర్వాహకులు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ ఒక ప్రకటనలో తెలిపారు.