ఉత్తరాఖండ్- దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జలవిలయానికి మొత్తం 42 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారులన్నీ మూసుకుపోయాయి. నదులపై ఒకటి రెండు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సహాయక చర్యలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నైనిటాల్ నగరానికి దారితీసే మూడు ప్రధాన హైవే రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నైనిటాల్కు రాకపోకలు నిలిచిపోయాయి. 24 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో నైనిటాల్ సరస్సు పొంగిపొర్లుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడటంతో పాటు, నీటి ఉధృతి కారణంగా 42 మంది చనిపోయారు. ఒక్క నైనిటాల్ జిల్లాలోనే 28 మంది మృత్యువాత పడ్డారు.
మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆర్మీ కూడా రంగప్రవేశం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హల్దావని జిల్లాలో గౌలా నదిపైనున్న వంతెన, చంపావత్ ప్రాంతంలోని చల్దీనదిపై నిర్మాణంలో ఉన్న వంతెన నీటిలో కొట్టుకుపోయాయి. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలోకి నీళ్లు చేరాయి.
నానక్ సాగర్ డ్యామ్ నుంచి నీటిని వదలడంతో, ఈ పార్క్కు సమీపంలో ఉండే లెమన్ ట్రీ హోటల్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు చార్ ధామ్ యాత్రకు దారితీసే మార్గాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన 22 మంది భక్తులను విపత్తు నివారణ బృందాలు రక్షించాయి.