కన్న పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీరభాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులను చూశాం. ఓ కసాయి తండ్రి భార్యతో హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు కౌంట్ చేస్తున్నాడు. చైనా జెజియాంగ్కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న బాబు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది. దీంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరారు. కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు.
దీనితో ఆ వ్యక్తి బిడ్డను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. అందులో భాగంగానే ఓ క్రూరమైన ప్లాన్ ఆలోచించాడు. ఆ ప్లాన్ ప్రకారం కొడుకును చూడాలని కన్నతల్లి కోరిందని చిన్నారిని తన కుటుంబసభ్యుల నుంచి తీసుకెళ్లాడు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ ప్రబుద్దుడు రెండేళ్ల చిన్నారిని సుమారు 18 లక్షలకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో రెండో భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అనుమానం వచ్చి వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కాగా, చైనాలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని అక్కడి పోలీసులు చెబుతున్నారు