అమరావతి-న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టారు.
విజయవాడలోని పట్టాభి రామ్ ఇంటిపై దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అంతే కాదు అదేవిధంగా విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించి పట్టాభి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అటు హిందూపురంలని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిపైనా వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల వద్ద ఆందోళనలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో చంద్రబాబు మాట్లాడారు. పరిస్థితి వివరించి కేంద్ర బలగాల సాయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులతో పాటు, ఆఫీస్ల వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం, కుట్రలో భాగంగా దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు వివరించారు. ఐతే దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని, పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతా బలగాల రక్షణ కల్పించాలని చంద్రబాబు, అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా, ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.