దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే సోనూసూద్ వంటి హీరోలు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తన వంతు సాయం చేస్తూ కరోనా కాలంలో రియల్ హీరోగా పేరు గడించారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివిస్తానంటూ ప్రకటించారు. తాజాగా హీరో అడివి శేష్ కూడా కోవిడ్ కష్టకాలంలో తన వంతు సాయం చేసి నిజమైన కథానాయకుడిగా నిలిచారు. కొవిడ్ బాధితులకు సహాయం చేస్తూ తన ఉదారత చాటుకున్నారు యువ నటుడు అడివి శేష్. ప్రస్తుతం కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో 300లకి పైగా కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అక్కడ తాగు నీటి కొరత ఉందని తెలుసుకున్న శేష్ 865 లీటర్ల వాటర్ బాటిళ్లను ఆ ఆసుపత్రికి పంపించారు. అక్కడితో ఆగిపోకుండా నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తనవంతు కృషి చేశారు. ఆస్పత్రి సిబ్బంది సహా ఎవరూ తాగు నీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇది గంటకు 1000 లీటర్ల నీటిని అందిస్తుంది.
ఎప్పటి నుంచో ఉన్న సమస్యని తీర్చడంతో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది నటుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సెలబ్రిటీలు ఏదైనా సమస్యకి పాక్షికంగా పరిష్కారం చూపడం సహజం కానీ శాశ్వత పరిష్కారం చూపడం అసాధరణం’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు.