ఇటీవల కాలంలో ప్రేమలు సరిహద్దులు దాటి పోతున్నాయి. ఖండాంతరాలు దాటి ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచి వస్తున్నారు. పాకిస్తాన్ సీమా హైదర్-సచిన్లది ఈ తరహా ప్రేమ కథే. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, బంగ్లాదేశ్ నుండి జూలీ, మొన్నటికి మొన్న
ఇటీవల కాలంలో ప్రేమలు సరిహద్దులు దాటి పోతున్నాయి. ఖండాంతరాలు దాటి ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచి వస్తున్నారు. పాకిస్తాన్ సీమా హైదర్-సచిన్లది ఈ తరహా ప్రేమ కథే. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, బంగ్లాదేశ్ నుండి జూలీ, మొన్నటికి మొన్న శ్రీలంక నుండి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు యువకుడి కోసం వచ్చేసింది ఓ యువతి. అలాగే భారత్ నుండి అంజు అనే మహిళ పాకిస్తాన్ పోరడు కోసం వెళ్లిపోయిన సంగతి విదితమే. అలాగే ఇటీవల పాకిస్తాన్ యువకుడి కోసం చైనా నుండి కూడా ఓ మహిళ దేశాలను దాటుకుంటూ వెళ్లింది. అయితే పాకిస్తాన్ కుర్రాళ్ల కోసం పరాయి దేశం నుండి వస్తున్న అమ్మాయిల కథనాలకు అతిగా స్పందించిన వ్యక్తి.. అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఏకంగా జైలు పాలయ్యాడు.
అసలు ఏమైందంటే.. పాకిస్తాన్లోని ప్రేమికుడి కోసం విదేశాల నుండి యువతి వచ్చిందంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది ఆమెకు సెక్యూరిటీ కల్పించేందుకు సదరు ప్రాంతానికి వెళ్లగా.. అది ఫేక్ అని తేలింది. ఆ ఫేక్ పోస్టు పెట్టి పోలీసులు సమయాన్ని వృధా చేసిన ఆ వ్యక్తిని మహమ్మద్ గులాబ్ అని గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..తన స్నేహితుల్లో ఒకరిని బ్రిటన్కు చెందిన ఎలా అనే మహిళ ఫేస్ బుక్ ద్వారా ప్రేమించిందని, అతడి కోసం సలార్జాయ్కు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
అయితే ఈ పోస్టు కాస్త వైరల్ అవ్వడంతో.. సదరు మహిళకు రక్షణ కల్పించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అయితే సదరు వ్యక్తి ఇంటికి చేరుకోగా.. ఎవ్వరూ కనిపించలేదు. దీంతో వెంటనే ఫేక్ న్యూస్ అని గుర్తించి గులాబ్ ను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే స్థానికులు మాత్రం అతడి అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా అన్నాక ఇలాంటి తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులు వస్తూనే ఉంటాయని, ఆ మాత్రం దానికే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు స్థానిక ప్రతినిధులను సంప్రదించాలని, లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.