కరోనా వల్ల వేల సంఖ్యలో ఆన్లైన్ కొనుగోళ్ల ఆర్డర్స్ చేస్తున్నారు. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా నివారణకు మూలికలు పనిచేస్తాయి అని నమ్మించి సైబర్ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘గింగో’ అనే తైలంతో కరోనాను నివారించొచ్చని అది తమ వద్ద దొరుకుతుందని ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధిని అలాగే ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలని నిండా ముంచారు నైజీరియన్ చీటర్స్. మెహదీపట్నంలో ఉంటున్న ఒక ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసిన కేటుగాళ్లు కరోనా నివారణ మందుకు మూలికల ఫార్ములా తెలిపితే రూ. 5 కోట్లు ఇస్తామని బురిడీ కొట్టించారు. ఆశపడిన ఆమె వారి ట్రాప్లో పడగా ఆ వైద్యురాలి నుంచే రూ. 20 లక్షలు కాజేసి షాకిచ్చారు.
అదేవిధంగా బర్కత్ పురాలో ఉంటున్న ఒక ఫార్మా ప్రతినిధికి గింగో తైలం తో కరోనా నివారణ ఉంటుందని అతని నమ్మించారు. ముంబై లోని ఏసిపి పేరుతో ఫోన్ చేసి తైలం అమ్మడం నిషేధమని చెప్పి అతన్ని భయపెట్టి అతని నుండి 50 లక్షలు కాజేశారు. దీంతో బాధితులు మోసపో యానని గ్రహించి వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు దందా జోరుగా సాగిస్తున్నారని, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకునేవారు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు.