శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు. అసలే కరోనా సమయం కావడం జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు. ఏడాదికి పైగా ఏకంగా 80 అడుగుల మేర సొరంగాన్ని తవ్వేశారు. ఏడాదికి పైగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు పోలీసులు. ఏడాది కాలంగా రహస్యంగా సొరంగం త్రవ్వకం సాగుతున్నట్లు గుర్తించారు. అసలు పోలీసులు, అటవీశాఖాధికారులు, టిటిడి విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా త్రవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ముంకు నాయుడు అనే వ్యక్తిని ఈ తవ్వకాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతనితో పాటు మరో ఆరుగురు కూలీలను అరెస్ట్ చేశారు. ఓ స్వామీజీ మంగళం బీటీఆర్ కాలనీ పైభాగంలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని కొండ వద్ద గుప్తనిధులు ఉన్నాయని చెప్పడంతో ఈ తవ్వకాలు జరిపినట్లుగా నిందితుడు అంగీకరించగా ఏడాది కాలంగా ఈ సొరంగాన్ని తవ్వినట్లు విచారణలో మంకు నాయుడు చెప్పాడు.
మనుసులు నడుచుకుంటూ వెళ్లేంతగా భూమి లోపల అంత పెద్ద సొరంగాన్ని చూసిన పోలీసులు షాక్ అవగా ఈ సొరంగాన్ని ఎలా తవ్వారనే అంశంపై దృష్టి పెట్టారు. 120 అడుగుల మేర సొరంగాన్ని తవ్వాలని స్వామీజీ చెప్పిన మాటలను నమ్మిన నిందితులు ఏడాది కాలంగా 80 అడుగుల సొరంగాన్ని తవ్వేశారు. స్వామీజీ చెప్పినట్లుగా ఏ ప్రాంతంలో ఈ నిధులు ఉన్నట్లుగా భావిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా మంకు నాయుడుకు నిధులు ఉన్నాయని చెప్పిన స్వామీజీ గత ఆరు నెలల క్రితమే చనిపోగా ఆయన చెప్పినట్లుగా మంకు నాయుడు నిధుల పిచ్చితో భారీ ఖర్చుతో ఏడాది కాలంగా ఈ ముఠాతో తవ్వకాలు జరిపిస్తున్నాడు. అయితే తరచుగా మనుషులు అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అనుమానించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి.