ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కాబోతున్నది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. దీంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం సత్యం పలికేవాడు, తండ్రి మాట జవదాటని వాడు, పురుషోత్తముడైన రాఘవ రాముడికి అశేషమైన భక్తులు ఉంటారు. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుకుంటారు హిదువులు. రామనామం జపిస్తూ అత్యంత భక్తి శ్రద్దలతో రామున్ని కొలుస్తారు భక్తులు. తెలుగు రాష్ట్రల్లో కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీరాముడికి పూజలు నిర్వహిస్తుంటారు. కాగా భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి అత్యంత ఎత్తైన విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరనున్నది. శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా ఏపీ విరాజిల్లనున్నది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా శ్రీరాముని పంచలోహ విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ గా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మంత్రాలయం గ్రామం రాఘవేంద్ర స్వామి దేవాలయంతో ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహ ఏర్పాటుతో మంత్రాలయం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా కీర్తి గడిస్తుందని అమిత్ షా వెల్లడించారు. తన చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం తన పూర్వ జన్మ సుకృతమని అమిత్ షా అన్నారు. జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని పంచలోహ విగ్రహ నిర్మాణం రెండేళ్లలో పూర్తికానుంది.
మంత్రాలయం శ్రీమఠానికి కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో రామాలయం నిర్మాణం జరగనుంది. ఈ పదెకరాల్లోనే తిరుమల వెంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారు. ఇప్పటికే కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటుండగా మంత్రాలయంలో శ్రీరాముడి విగ్రహ ఏర్పాటుతో మరింత ఆధ్యాత్మిక వైభవం వెల్లువిరియనున్నది.
Laid the foundation stone for a 108-foot-tall statue of Prabhu Shri Ramachandra Ji, to be built by Shri Raghavendra Swami Mutt at Kurnool, Andhra Pradesh.
The colossal statue of Prabhu Ram, which will be the tallest in India, will immerse the city with the emotion of devotion… pic.twitter.com/J45qwGQJvm
— Amit Shah (@AmitShah) July 23, 2023