భారత దేశం ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు. హిందూ దేశంగా పిలవబడుతున్నప్పటికీ లౌకికవాదం నెలకొని ఉంటుంది. అలాగే ఈ దేశం వింతలు, విడ్డూరాల సమాహారం కూడా. కొన్ని సార్లు నమ్మలేని విధంగా ఉంటాయి.
భారత దేశం ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు. హిందూ దేశంగా పిలవబడుతున్నప్పటికీ లౌకికవాదం నెలకొని ఉంటుంది. అలాగే ఈ దేశం వింతలు, విడ్డూరాల సమాహారం కూడా. కొన్ని సార్లు నమ్మలేని విధంగా ఉంటాయి. ఇప్పటికీ కూడా కొన్ని వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ఇటువంటి ఆచారాలను విశ్వసిస్తారు. వాటిని ఆచరిస్తారు. భవిష్యత్ తరాలకు వాటిని అనుసరించేలా మార్గనిర్దేశకం చేస్తారు. అటువంటి ప్రాంతాల్లో ఒకటి ఇప్పుడు మనం చెపుకోబోయే గ్రామం. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్ర శనిసింగనాపూర్ తరహాలో ఈ గ్రామానికి కూడా తలుపులు ఉండవు. వీటితో పాటు విచిత్రమైన విశేషాలున్నాయి.
అదే ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని రాజ్ కనికా పరిధిలోని సియాలియా అనే గ్రామం. ఈ గ్రామానికి తలుపులు కాదూ కదా.. కిటీకీలు కూడా ఉండవు. ఎందుకనుకుంటున్నారా.. ఈ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఖరాఖై దేవాలయమే ఇందుకు కారణం. ఆ దేవాలయంలో ఉండే దేవత ఖరాఖై తమను రక్షిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు కాబట్టే.. ఆ ఊరిలో తలుపులను ఏర్పాటు చేసుకోరు. అయితే ఆ గుడి పూజారి చెబుతున్న దాని ప్రకారం.. 600 సంవత్సరాల క్రితం.. ఖరాఖై దేవత అక్కడ వెలిసిందట. ఆమె ఒక తలుపు మీద కూర్చొని కనిపించడంతో.. తలుపులు అవసరం లేదని విశ్వసిస్తుంటారని చెబుతున్నారు. తలుపులు లేనప్పటికీ ఈ ఊరిలో ఒక్క దొంగతనం కూడా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. సియాలియాలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే జంతువులు వంటివి దూరకుండా వెదురుతో తయారు చేసిన తెరలాంటిది ఏర్పాటు చేసుకుంటారు.
అలాగే ఖరాఖై దేవాలయానికి కూడా పైకప్పు ఉండదు. గుడి చుట్టూ పెద్దపెద్ద వృక్షాలు ఉంటాయి. దేవత బహిరంగ ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడుతుందని గ్రామస్థులు విశ్వసిస్తుంటారు. ఒడియాలో, ఖరాఖై అంటే సూర్యకాంతిని ఆస్వాదించడమని అర్థమట. అందుకే ఆమెకు పై కప్పు నిర్మించలేదని తెలుస్తోంది. ఏదైనా సమస్య వస్తే కోర్టుకు వెళ్లిన దాఖలాలు కూడా లేవట. సమస్య గ్రామంలోనే పరిష్కారమౌతుందని తెలుస్తోంది. కొత్త పెళ్లై వచ్చిన వారు సైతం ఈ ఆచారాలను ఫాలో అవుతుంటారట. మంగళవారం, శనివారం పెద్ద యెత్తున దేవతకు పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి పెట్టిన నైవేద్యం తింటే రోగాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఏదైనా కోరుకుని.. ఆ కోరికలు తీరితే.. మట్టి గుర్రాలను అమ్మవారికి సమర్పిస్తుండటం విశేషం. ఇవి దేవాలయంలో మొక్కు కింద చెల్లించిన మట్టి గుర్రాలు అనేకం ఉన్నాయని గుడి పూజారి చెబుతున్నారు.