పులివెందుల ప్రజలకు ఏపీ సీఎం జగన్ వరుస గిఫ్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించిన జగన్ సర్కార్.. తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ని నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. పులివెందులలో సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నారు. అదే ఊపులో మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్మే కేబుల్ బ్రిడ్జ్ ని కూడా ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. రకరకాల రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న కేబుల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలో షేర్ చేసింది.
పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. డ్రోన్ కెమెరాలో రికార్డ్ చేసిన బ్రిడ్జ్ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ బస్ టెర్మినల్(బస్టాండ్), మరో పక్క అహోబిలపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఇలా వరుసగా పులివెందుల ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. వీటన్నిటినీ ఇవాళ సీఎం జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12.40కి సీఎం పులివెందులలోని భాస్కరపురం చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 మధ్యలో పులివెందులలోని విజయ హోమ్స్ జంక్షన్ ని ప్రారంభిస్తారు. అనంతరం విస్తరించిన రహదారిని ట్రాఫిక్ కోసం తిరిగి తెరిచే సమయంలో అంటే 1.30 నుంచి 1.40 మధ్యలో కదిరి రోడ్ జంక్షన్ లో ఉంటారు.
1.50 నుంచి 2 గంటల మధ్యలో కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. 2.05 నుంచి 2.20 మధ్యలో మైత్రి లేఅవుట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.35 నుంచి 2.50 మధ్యలో పులివెందుల రాయలపురం బ్రిడ్జ్ ని (కేబుల్ బ్రిడ్జ్) ప్రారంభిస్తారు. 3 నుంచి 3.30 గంటల సమయంలో వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ని ప్రారంభించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 3.35 నుంచి 3.55 మధ్యలో అహోబిలపురం స్కూల్ ని ప్రారంభిస్తారు. 4.05 నుంచి 4.20 మధ్యలో 10 ఎంఎల్డీ కెపాసిటీ కలిగిన ఎస్టీపీలను (మురుగునీటి శుద్ధి కేంద్రాలను) ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.40కి ఇడుపులపాయ చేరుకొని అక్కడే బస చేస్తారు. డిసెంబర్ 25న ఉదయం 8.40కి ఇడుపులపాయ నుంచి బయలుదేరి.. 9.05కి పులివెందుల చేరుకుంటారు.
9.15 నుంచి 10.15 మధ్యలో సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. 10.25కి పులివెందుల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మొత్తానికి సీఎం ఈ క్రిస్మస్ కి పులివెందుల ప్రజానీకానికి.. ఒక బస్టాండ్, కేబుల్ బ్రిడ్జ్, ఉన్నత పాఠశాల, కూరగాయల మార్కెట్, విజయ హోమ్స్ జంక్షన్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఇలా వరుస బహుమతులు ఇవ్వనున్నారన్నమాట. ఇదిలా ఉంటే జనవరి నెలాఖరులో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయని జగన్ సర్కార్ ప్రకటించింది. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు జరగనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మరి కడపలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ప్రారంభానికి సిద్ధమవుతున్న పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ #Pulivendula #CableBridge pic.twitter.com/IUriENM0eq
— YSR Congress Party (@YSRCParty) December 23, 2022