మల్టీప్లెక్స్ ఇదొక హాలీవుడ్ మోడల్ కల్చర్. దీన్ని రిచ్ పీపుల్ నుంచి సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చేసి.. జీవితంలో ఈ కల్చర్ ఒక భాగం అనేలా చేశారు. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూసి.. ఇంటర్వెల్ తర్వాత బయటకి వచ్చి సమోసాలు, డ్రింక్ లు కొనుక్కునేవారు. ధర కూడా ఎక్కువేం కాదు. బడ్జెట్ లోపే ఉండేది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారని చెప్పి.. తిను బండారాలు హ్యాండ్ బాగుల్లో పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఈ కల్చర్ లేదు. హ్యాండ్ బ్యాగుల్లో తినే వస్తువులు పట్టుకెళ్తే నేరం. ఏదో బాంబులు తీసుకెళ్లినట్టు ఫీలవుతారు. పెద్దలంటే ఆకలికి తట్టుకుని ఉంటారు. కానీ పిల్లలు అలా ఉండలేరుగా. ఇంట్లో వండిన ఫుడ్ కూడా తీసుకు రానివ్వకపోతే ఇక సామాన్యుడు బతికేదెలా? అని అంటారు.
మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధర కంటే తినే వాటి ధరే ఎక్కువ. రెండు సమోసాల ధర 100 పైనే ఉంటుంది. ఇక 110 గ్రాముల పాప్ కార్న్ 200 పైనే, కూల్ డ్రింక్ 300 పైనే. రెండు కూల్ డ్రింక్ లు అయితే 600, పాప్ కార్న్ 200 దగ్గర దగ్గర తిండి ఖర్చు 800 అవుతుంది. ఒక డ్రింక్, పాప్ కార్న్ అయితే 500 అవుతుంది. అంటే సినిమా చూడాలంటే ఒక మనిషికి తిండికి 500, టికెట్ కి 300 మొత్తం 800/- అవుతుంది. అదే కుటుంబంతో చూడాలంటే నలుగురికీ 3 వేలు పైనే. పోనీ సినిమా ఏమైనా అద్భుతంగా ఉంటుందా అంటే ప్. డబ్బులకి న్యాయం జరిగిందన్న సంతృప్తి ఉండదు. సినిమా బాగుంటే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. బాగోపోతేనే మనసు బాధపడుతుంది. డబ్బులంటే లెక్క ఉండి.. ఖర్చు పెట్టడానికి సారీ వృధా చేయడానికి ఇష్టపడని నిజమైన సినిమా లవర్స్ అయితే.. ‘ఒరేయ్ నువ్వు తినడానికి వస్తున్నావా? సినిమా చూడ్డానికి వస్తున్నావా?’ అని అంటారు. ‘3 గంటల సేపు ఏమీ తినకుండా ఎలా ఉండగలం బోరో’ అని అంటారు.
అలా అని అంత రేట్లు పెట్టి కొనలేరు. ఆకలికి తట్టుకోలేరు. రిచ్ పర్సన్స్ గురించి పక్కన పెడితే 50 శాతం మంది తమకి తెలియకుండానే దోపిడీకి గురవుతున్నారన్న విషయం తెలిసినా దీన్నుంచి బయటపడలేని పరిస్థితి. ఇదే పాప్ కార్న్ బయట 25 నుంచి 30 రూపాయలు ఉంటుంది. మల్టీప్లెక్స్ కొచ్చేసరికి 300 రూపాయలు అవుతుంది. క్వాంటిటీ ఏమైనా ఎక్కువా అంటే కాదు. పోనీ ఈ పాప్ కార్న్ తింటే హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయా? అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంట్రస్ట్ తో కలిపి వస్తాయ్ జబ్బులు. పెద్దవాళ్ళు కాబట్టి డబ్బులు వేస్టు చేసుకోవడం, జీవితాన్ని అల్లం, వెల్లుల్లి పేస్టు చేసుకోవడం ఎందుకని చెప్పి కంట్రోల్ లో ఉంటారు. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు పెద్దల పప్పులేం ఉడకవు. వాళ్ళు ఏది చూస్తే అది కొనాల్సిందే. అప్పుడు రక్త కన్నీరు వస్తుంది. పోనీ ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకెళ్దాం అనుకుంటే ఈ మల్టీప్లెక్స్ వాళ్ళు అనుమతించరు. ఏ తెచ్చుకుంటే వీళ్ళకి ఏంటి సమస్య? అని అనిపించవచ్చు.
రెండు సమస్యలు ఉన్నాయి? ఒకటి తినేసి ఆ చెత్తని థియేటర్ లో వదిలేసి పోతారు. అసలే మనకి క్రమశిక్షణ ఎక్కువ కదా. ఆ చెత్తని శుభ్రం చేయడానికి మళ్ళీ స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. ‘ఏ టికెట్ కొంటున్నాంగా.. ఆ మాత్రం సర్వీస్ కూడా చేయరా?’ అంటే అది వాళ్ళ వ్యాపారం. వాళ్లకి నచ్చినట్టు చేస్తారు. ఇంకో సమస్య.. మెయింటెనెన్స్ ఎక్కువ. మల్టీప్లెక్స్ లోపల కంటే బయట ఉండే పరిసరాల మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చే ఎక్కువ. ఇదంతా ఎవరి కోసం అంటే ప్రేక్షకుల కోసం కాదు. డబ్బుల కోసం వ్యాపారుల స్ట్రాటజీ. మల్టీప్లెక్స్ కి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేయాలంటే ప్రేక్షకులని, ముఖ్యంగా పిల్లల్ని ఆకర్షించడం కోసమే ఈ ఆర్భాటాలు అన్నీ. వాళ్ళకీ కొన్ని లెక్కలు ఉంటాయి. మహా నగరంలో ఒక ఇంటి స్థలం కొనాలంటే 2, 3 కోట్లు అవుతుంది. అదే కమర్షియల్ స్పేస్ కొనాలంటే ఎన్ని కోట్లు అవుతుంది.
ఆ డబ్బంతా రాబట్టాలంటే రెంట్లు ఎక్కువ పెట్టాలి. ఆ రెంట్లు భరించాలంటే.. మల్టీప్లెక్స్ లలో గేమ్ జోన్, ఫుడ్ జోన్ అంటూ సామాన్యులు తమ డబ్బులు ఊడగొట్టుకునేలా పెట్టాలి. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. సుప్రీంకోర్టు కూడా సినిమా ప్రాంగణంలో బయట ఫుడ్ ని నిషేధించే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పేర్కొంది. నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా సినిమా ప్రాంగణంలోకి బయట ఫుడ్ ని అనుమతించకుండా.. తమ పరిసరాల్లో స్నాక్స్, కూల్ డ్రింకులు, ఇతర ఆహార పదార్థాలు అమ్ముకులే అర్హత వారికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అలానే వాటిని కొనుక్కోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రేక్షకులకు ఉంటుందని తెలిపింది. అయితే శిశువుల కోసం తీసుకెళ్లే ఫుడ్ ని నిషేధించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. శిశువులు పాప్ కార్న్, కూల్ డ్రింక్ లు తీసుకుని, తమ ఆరోగ్యం పాడు చేసుకుని.. థియేటర్ యజమానులకు లాభం చేకూర్చలేరు కదా.
సినిమా అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఏం తీసుకురావాలో, ఏం తీసుకురాకూడదో నిర్ణయించే హక్కు అతనికి ఉంటుందని కోర్టు వెల్లడించింది. ఇంటి దగ్గర నుంచి ఏ జిలేబీనో, లేక ఏ జిగురు ఫుడ్డో తీసుకెళ్లి సీట్లో కూర్చుని తింటారు. పోనీ తినేసి చేతులు తన బట్టలకి తుడుచుకుంటారా అంటే లేదు. సీట్లకి తుడుస్తారు. సీట్లు పాడవుతాయి. ఇందుకే అనుమతించరని, ఆ హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మరి థియేటర్ లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ లోపలకు తీసుకెళ్లి.. సీట్లకి అంటిస్తే పర్లేదా అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కొని అంటించినా.. వాళ్లకి లాభం వస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు.
అయితే హైదరాబాద్ కి చెందిన అవినీతిపై వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి, సోషల్ యాక్టివిస్ట్ అయిన విజయ్ గోపాల్.. ఈ మల్టీప్లెక్స్ లో ఫుడ్ నిషేధించే హక్కు ఉందా అని హైదరాబాద్ పోలీసులతో చర్చించారు. ఒక వ్యక్తి థియేటర్ లేదా మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు తనతో పాటు ఆహార పదార్థాలు తీసుకెళ్లకూడదని నిషేధ చట్టం ఏమైనా ఉందా? అని ఆర్టీఐ దాఖలు చేశారు. 1955 సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం.. ఎక్కడా కూడా ప్రేక్షకులు తమ సొంత ఫుడ్ ని తీసుకెళ్లకూడదు అని పేర్కొనబడింది. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే బయట ఫుడ్ ని థియేటర్ లోకి తీసుకెళ్ళవచ్చునని, యజమానులు అడ్డుపడితే ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది. భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది.
ఫిర్యాదు చేసినా ప్రేక్షకుడికి అనుకూలంగా జరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే నా ప్రైవేట్ ప్రాపర్టీ నా ఇష్టం అని అంటాడు. ఇష్టముంటే రావచ్చు, లేదంటే లేదు అని అంటాడు. ఇష్టముంటే కొనచ్చు లేదా కొనడం మానేయండి అని కోర్టులో వాదిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫినిషింగ్ లో మాట్లాడుకోవచ్చు. సరే ఇందాక మనం చెప్పుకున్న విజయ్ గోపాల్ తెలుసుకున్న దాని ప్రకారం.. సినిమా థియేటర్స్ లోకి బయట ఫుడ్ తీసుకెళ్లకూడదని అనే చట్టం ఎక్కడా లేదు. అలానే ఏ వ్యాపారంలో అయినా చట్టం ఉల్లంఘనలకు గురవుతుందనిపిస్తే.. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయవచ్చునని హైదరాబాద్ పోలీస్ తెలిపారు. అయినప్పటికీ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ యజమానులు ప్రేక్షకులని బయట ఫుడ్ తీసుకురానివ్వకుండా అడ్డుపడుతున్నారు.
సినిమాలు, మల్టీప్లెక్స్ లు, రెస్టారెంట్లు, పిక్నిక్ స్పాట్లు, వాటర్ స్పోర్ట్స్ లాంటివి సర్వీస్ ఇండస్ట్రీలో ఒక భాగం. మన దేశంలో వ్యాపారం నిర్వహించే నియమాల ప్రకారం తమ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఎవరినైనా తిరస్కరించే హక్కు ఉందని చట్టం చెబుతుంది. థియేటర్ లో గానీ, రెస్టారెంట్ లో గానీ బయట ఆహారాన్ని తీసుకెళ్లడం అనేది వీడని చిక్కుముడి. దీని మీద అటు సామాన్యుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేరు. ఇటు వ్యాపారులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పలేరు. ఎందుకంటే ఒక వ్యాపారిని తాను తన సొంత ప్రదేశంలో సినిమా, ఫుడ్ వంటి సర్వీస్ అందిస్తున్నప్పుడు.. బయట ఫుడ్ తీసుకురాకుండా నియమాలు పెట్టుకునే హక్కు వ్యాపారులకు ఉంటుంది. ఈ విషయంలో వ్యాపారులను అడ్డుకునే చట్టం కూడా లేదు.
అయితే థియేటర్ యజమానులు ప్రేక్షకులకు ఫుడ్ తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటే ఫిర్యాదు చేయవచ్చునని అదే చట్టం చెబుతుంది అదే సమయంలో ప్రాపర్టీ యజమానికి తన సొంత ప్లేస్ లో నియమాలు పెట్టుకునే హక్కు ఉంటుందని చెబుతుంది. ఈ చర్చ సుదీర్ఘంగా నడుస్తుంది తప్ప.. దీనికి పర్మినెంట్ సొల్యూషన్ అయితే ఉండదు. అయితే ఎవరి సమస్యకి వాళ్ళే పరిష్కారం చూసుకోవాలి. ఈ సమాజం ఎలాంటిదంటే.. ప్రభుత్వం మద్యం, సిగరెట్ అమ్మకాలకు అనుమతి ఇచ్చి.. తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంది. ఒకవేళ ప్రజలు సీరియస్ గా తీసుకుని తాగడం మానేస్తే ప్రభుత్వానికే నష్టం. అలానే ప్రేక్షకులు డబ్బులు వృధాగా పోగొట్టుకోవడం ఎందుకని అనుకుని సినిమాలు చూడ్డం మానేస్తే.. లేదా థియేటర్ లో పప్పలు కొనడం మానేస్తే వాళ్ళకే నష్టం. అప్పుడు దారిలోకి వస్తారేమో. ఏమో చెప్పలేం.
నియంత్రణ అనేది మనిషిలో ఉంటుంది. ఒక హీరోయిన్ ఎక్స్ పోజింగ్ చేస్తూ యువతను రెచ్చగొడుతుంది. దానికి ఆమె పెట్టుకున్న పేరు జీవనోపాధి. కానీ అదే హీరోయిన్ ని దారిన పోయే అమ్మాయిలో చూసి పాడు చేయాలనుకుంటే వీడి జీవితం పోతుంది. అడవిలో పులి ఉంటుందని తెలిసి దాని దగ్గరకు వెళ్లడం అమాయకత్వం. అలానే ఒక మనిషి ఆర్థికంగా నష్టపోతాడని తెలిసి.. నష్టం చేకూర్చే వాటివైపు వెళ్లడం కూడా తన తప్పే. మనుషులను ఆకర్శించడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఋషుల్లా ఇవేమీ పట్టనంటూ ఉండడం సక్సెస్ ఫుల్ పర్సన్స్ లక్షణం. గోల్ రీచ్ అవ్వాలంటే ఇలాంటి వాటి పట్ల మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సినిమా మా బలహీనత అండి అనుకుంటే.. సామాన్యులకు మల్టీప్లెక్స్ కి కాకుండా మామూలు థియేటర్ కి వెళ్తే ఆప్షన్ కూడా ఉంది.
అక్కడైతే టికెట్ కి 150, పాప్ కార్న్, కూల్ డ్రింక్ కి 120 అవుతుంది. కుటుంబంతో వెళ్తే 1000 అవుతుంది. అయినా కానీ మల్టీప్లెక్స్ లకే ఎందుకు వెళ్తారంటే.. అక్కడ స్పేస్ విశాలంగా ఉంటుంది. ఇష్టమొచ్చినట్టు తిరగచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు. ఆ కల్చర్ అంతా పోష్ గా ఉంటుంది. కేవలం స్పేస్ కోసం ఇంత డబ్బు వృధా చేస్తున్నామా అనుకునేవాళ్లు ఉంటారు. ఇదంతా కాదండి.. క్లాస్ గా ఉంటుంది కాబట్టి వెళ్తున్నాం అని అంటారు. కానీ డబ్బులు అయిపోయాయన్న బాధ అయితే ఉంటుంది. ఇక సినిమా బాగోకపోతే ఆ బాధ వారం రోజుల పాటు ఆ మనిషితో ట్రావెల్ అవుతుంది. ఇంత బాధ పడే బదులు సినిమా చూడడం మానేయచ్చు కదా అంటే.. అబ్బే అదెలా కుదురుతుంది అని అంటారు.
ఇక సినిమాలకి వెళ్ళకూడదు అని అనుకునేవాళ్లు ఉంటారు. మళ్ళీ లోపల పురుగు గోలికేస్తది, పదా సినిమాకి అని. మళ్ళీ మామూలే. థియేటర్ ఓనర్స్ దోచుకుంటున్నారు అని లోపల ఉన్న అపరిచితుడు బయటకొస్తాడు. ఇంట్లో వాళ్ళ మీద ఆవేదన వెల్లిబుచ్చుతాడు. ఒక రోజంతా పిసుక్కుంటాడు. మళ్ళీ ఏ సినిమానో రిలీజ్ అయితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఒక్కడ్ని బతికించడం కోసం 99 మంది జీవితాలు.. అంతే ఇక. ఇదీ కొంతమంది సమాజ శ్రేయోభిలాషులు చెప్పే మాట. మరి థియేటర్ యజమానులు వర్సెస్ సామాన్యులు.. ఇందులో న్యాయం ఎవరిది? ఈ ఇద్దరి వాదనలు కరెక్ట్ ఏనా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.