గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలోకి నీరు చేరుకుని.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త భయం రాములోరి భక్తులను వెంటాడుతుంది. అదేంటంటే.. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం వస్తే.. పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పటికే భద్రాద్రి దగ్గర గోదావరి నీటి మట్టం 60 అడుగులు దాటింది. ఇది ఇలానే కొనసాగితే.. 64 అడుగులు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచాలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ గోదావరి మాత్రం ఈ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు పోలవరం పూర్తైతే.. భద్రాచలం దగ్గర ఎప్పుడూ 43 అడుగుల నీటిమట్టం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..
భద్రాచలం దగ్గర ఈ స్థాయిలో భారీ వరదలు ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1986లో అత్యధికంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 60 అడుగులు దాటడం చాలా అరుదు. 1976 లో 63.9, 1983లో 63.5, 1986 75.6, 1990లో 70.8, 2006లో 66.9 అడుగుల నీటి మట్టం కనిపించింది. 2013, 2020లోనూ గోదావరి నీటి మట్టం 60 అడుగులు దాటింది.
1986లో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం 75.6 అడుగులకు చేరడంతో.. వాజేడు నుంచి వరరామచంద్రాపురం వరకు గల పరివాహక ప్రాతం వరదలతో కకావికలం అయ్యింది. జనజీవనం చిన్నాభిన్నం అయ్యింది. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల కాలం పట్టింది. ప్రస్తుతం అవే పరిస్థితులు కనిపిస్తుండటంతో జనాలు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించుకుంటున్నారు.
పోలవరం పూర్తయితే భద్రాద్రికి ముప్పు తప్పదా..
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే.. భద్రాచలం వద్ద గోదావరి కనీస నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటిందని నీటి పారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వరద ముప్పు తప్పదని అధిక శాతం ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 60 అడుగులు దాటితేనే వరద నీరు రాములోరి పాదాల వరకు వచ్చింది. ఈ వర్షాలు ఇలానే కొనసాగితే.. అది 64 అడుగులకు చేరుకునే అవకాశం ఉండటంతో.. అందరిలో టెన్షన్ మొదలైంది.
ఇప్పటికే ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దుమ్ముగూడె మండలంలోని 11 గ్రామాలు, చర్ల మండలంలో 15 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం పర్ణశాలలో సీతమ్మ నార చీరలు ఆరేసిన ప్రాంతంతో పాటు విగ్రహాలు పూర్తిగా నీట ముగిగాయి. భద్రాచాలంలో ఏకంగా 559 గ్రామాలు నీట మునిగిపోయాయి. నీటి మట్టం మరింత పెరిగితే ఆ ప్రాంతాల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రారంభం అయ్యింది.
ఇక్కడ తగ్గినా.. పైనుంచి పోటెత్తుతుంది..
ప్రస్తుతానికి తాళిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్ల నుంచి వరద ప్రవాహం తగ్గడం కాస్త ఊరటనిస్తున్నా.. ఛత్తీస్గడ్, మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలకు పైనుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. ఎగువన ఉన్న ప్రాజెక్ట్ల నుంచి కూడా భారీగా నీటిని వదులుతుండటంతో.. భద్రాచలంలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాణహిత, ఎల్లంపల్లి, మేడిగడ్డ, లక్ష్మీ పార్వతి బ్యారేజీల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద నీరంతా భద్రాచాలం మీదుగా పోలవరం ప్రాజెక్ట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ధవళేశ్వరంకు వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో పోలవరం పూర్తయితే.. ఈ వరద నీరంతా వెనక్కి తన్నడం మొదలవుతుంది. అప్పుడు భద్రాచలం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనిలో భద్రాచలం ఆలయ పరిస్థితి ఏంటి.. ఎంతో ఘన చరిత్ర కలిగిన భద్రాచలం ఆలయ ఆనవాళ్లు నీటిలో కలిసిపోతాయా అనే సందేహాలు రాములోరి భక్తులను భయపెడుతున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన భద్రాద్రికి వరద గండం పొంచి ఉండటంతో అటు రాములోరి భక్తులు…ఇటు భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.