ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆలయాలకు తరలి వెళ్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బాబాని పూజిస్తారు. కొంతమంది అయితే సాయిబాబాకి కానుకలు సమర్పిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన వ్యక్తి షిరిడి సాయిబాబాకి బంగారు కిరీటాన్ని బహుకరించారు. దాని ధర ఎంతో తెలుసా?
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః.. అని కీర్తిస్తూ గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. సనాతన ధర్మం ప్రకారం.. భగవంతుడైన ఆ నారాయణుడే ఆది గురువు. ఆయన నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి వశిష్ఠుడు, వశిష్ఠుడి నుంచి శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరుడు నుంచి వ్యాసుడు, వ్యాసుడు నుంచి శుకుడు, శుకుడి నుంచి గౌడపాదుడు, గౌడపాదుడు నుంచి గోవింద భగవత్పాదుడు, గోవింద భగవత్పాదుడు నుంచి ఆదిశంకరాచార్యులు వచ్చి సనాతన ధర్మంలో గురువులుగా ఎంతోమందికి దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక విలువలు నేర్పుతూ ఆ మార్గంలో నడిపించే వారే గురువు. అటువంటి గురువులను గౌరవించుకునే రోజే ఈ గురు పౌర్ణమి. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు.
హిందువులు ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురువులకు పూజ చేసి.. కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే కొంతమంది దేవుడికి కానుకలు సమర్పించడం ద్వారా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కుర్రాడు సాయిబాబాకి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. రూ. 20 లక్షల విలువ చేసే బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి విరాళంగా సమర్పించారు.
హైదరాబాద్ కి చెందిన వంశీ కృష్ణ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. సాయిబాబా అంటే ఎంతో ప్రీతి కలిగిన వంశీ కృష్ణ.. సాయిబాబాకి విలువైన రాళ్లతో అందంగా డిజైన్ చేయించిన కిరీటాన్ని సమర్పించారు. ఈ బంగారు కిరీటం బరువు 365 గ్రాముల బరువు కలిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులు హారతి సమయంలో బాబాకు అలంకరించారు. కాగా వంశీ కృష్ణను సాయి ట్రస్ట్ అధికారులు శాలువాతో సత్కరించి బాబా విగ్రహాన్ని బహుకరించారు. బాబా ఆశీస్సులతోనే తాను ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానని.. ఆ విశ్వాసంతోనే బాబాకి బంగారు కిరీటాన్ని సమర్పించానని అన్నారు.